మహిళలతో ప్రబోధానంద అసభ్య ప్రవర్తన, హత్యలూ: జేసీ, శిష్యుల ఎదురుదాడి
అనంతపురం: తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ప్రబోధానంద స్వామి వర్గం మధ్య విమర్శలు వేడి రాజుకుంది. జేసీ బుధవారం ప్రబోధానందపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ప్రబోధసేవా సమితి కూడా అంతేస్థాయిలో స్పందించింది. చినపొలపాడులో జరిగిన ఘటనపై జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended Video
దక్షిణాదిన ఎన్నడూ జరగని సంఘటన చినపొడమలలో జరిగిందని వాపోయారు. వినాయక నిమజ్జనం ఎంతో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ అని చెప్పారు. వినాయక నిమజ్జనం పర్వం సందర్భంగా ఆశ్రమం వద్దకు రాగానే అక్కడి భక్తులు రాళ్లదాడి చేశారన్నారు. వాహనాలు ధ్వంసం చేశారని చెప్పారు. ఎన్నడూ చూడని ఆయుధాలతో దాడులు చేశారన్నారు.
బాబు ఏదీ తొందరగా తేల్చరు, నాపై దాడి చేశారు: జేసీ, ఇవీ ప్రబోధానంద వీడియోలు!
పోలీసులే పారిపోయారని జేసీ ఆగ్రహం
హింసాత్మక ఘటన జరుగుతుండటంతో పోలీసులు చూస్తూ కూర్చున్నారని జేసీ ధ్వజమెత్తారు. పోలీసులు కనీసం గాలిలోకి కాల్పులు జరపాలి కదా అని నిలదీశారు. ఆశ్రమానికి చెందిన వారు రాళ్లు వేస్తుంటే మాకన్నా ముందే పోలీసులు పారిపోయారని మండిపడ్డారు. లాఠీలు, తుపాకులు ఉన్న పోలీసులో పారిపోతే ఇక ఏమనాలన్నారు.
డేరా బాబాను మించిపోయాడు, మహిళలతో అసభ్య ప్రవర్తన
ఉదయం తొమ్మిది గంటల నుంచి రోడ్డుపై కూర్చుంటే తప్ప పోలీసులు పట్టించుకోలేదని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రబోధానంద డేరా బాబాను మించిపోయాడన్నారు. స్థానిక మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తారన్నారు. దొంగ రేషన్ కార్డులు, దొంగ ఆధార్ కార్డులు ఆశ్రమంలో ప్రింట్ చేస్తున్నారని చెప్పారు. దేవుళ్లను బూతులు తిట్టేవాడు స్వామియా అని నిప్పులు చెరిగారు.
ప్రబోధానంద మూడు హత్యలు చేశాడు
ప్రబోధానంద ఇప్పటికే మూడు హత్యలు చేశారని జేసీ తీవ్ర ఆరోపణలు చేశారు. అతనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని తెలిపారు. తన తప్పు ఏదైనా ఉంటే బహిరంగ క్షమాపణ చెప్పడానికి సిద్ధమని అన్నారు. స్థానిక పోలీసులనే నేను తప్పుపడుతున్నానని చెప్పారు.
జేసీపై ప్రబోధ సేవా సమితి ఆగ్రహం
మరోవైపు, జేసీ దివాకర్ రెడ్డి పైన ప్రబోధ సేవా సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిమజ్జనం పేరుతో జేసీ రౌడీయిజం చేస్తున్నారని ఆరోపించింది. ఆశ్రమంసమీపంలో నీళ్లు లేకున్నా గొడవ చేయించేందుకే ఆశ్రమ మార్గంలో నిమజ్జనం చేపట్టారన్నారు. జేసీకి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వవద్దన్నారు. ధ్వంసమైన ఆశ్రమ ఆస్తులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. జేసీపై చర్యలకు చంద్రబాబుకు వినతిపత్రం ఇస్తామని, దాడులకు జేసీ, పోలీస్ శాఖ బాధ్యత వహించాలన్నారు. ఆశ్రమం ఉన్న చిన్న పడవల గ్రామంలో జేసీ రెండు గ్రూపులను తయారు చేయించారని, జేసీ రోడ్డుపై బైఠాయించి తన అనుచరులను పురమాయించారన్నారు. ప్రబోధానందను డేరా బాబాతో పోల్చుతున్న జేసీ.. ఆశ్రమంలో ప్రారంభోత్సవానికి ఎందుకు వచ్చాడని ప్రశ్నించారు.