ఓ పార్టీకి అనుకూలం అంటున్నారు: జేపీ, కూర్చొని మాట్లాడితే ఎలా: దేవినేని దిమ్మతిరిగే కౌంటర్
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో పార్టీలు కలిసి పని చేయాలని, లేదంటే వారిని చరిత్ర క్షమించదని లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ అన్నారు. అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయమై కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వివాదం నడుస్తోందని, మన అనైక్యత వల్ల ఇప్పటికే చాలా నష్టం జరిగిందన్నారు.
విభజన హామీల్లో వివాదం లేని అంశాలు, వివాదం ఉన్న అంశాలు వేరు చేసి ఒక ప్రక్రియ ద్వారా అమలుకు ప్రయత్నించాలని పార్టీలకు సూచించారు. రావలసిన వనరుల విషయంలో ఆలస్యం చేస్తే తర్వాత ఇచ్చినా ఫలితం ఉండదని చెప్పారు. ఇది పార్టీల ప్రయివేటు వ్యవహారం కాదన్నారు. అధికార పీఠం ప్రయత్నంలో ఏపీ ప్రజల భవిష్యత్తు బలి పెట్టవద్దన్నారు.
ఓ పార్టీకి మద్దతుగా అంటున్నారు
విజయవాడలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రం మేలు, దేశ ఐక్యత గురించి తాను మాట్లాడుతుంటే ఓ పార్టీకి మద్దతుగా మాట్లాడుతున్నానని ఆరోపణలు చేస్తున్నారని, ఇంతకన్నా ఉన్మాదం ఏమైనా ఉందా అని జేపీ ప్రశ్నించారు. రాస్తా రోకోలు, బందులతో ప్రయోజనం ఉండదని గత అనుభవాలు చెబుతున్నాయన్నారు. ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారన్నారు.
కలిసి పని చేసి.. ఏం జరిగిందంటే?
కాగా, తొలుత పవన్ కళ్యాణ్, ఉండవల్లి అరుణ్ కుమార్, జయప్రకాశ్ నారాయణ వంటి వారు ఇటీవల కలిసి పని చేసారు. ఆ తర్వాత పవన్పై జేపీ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని విమర్శలు వచ్చాయి. దీనిపై ఆయన పైవిధంగా స్పందించారు.అంతేకాదు, హోదా కోసం అందరు కలిసి పని చేయాలని సూచించారు. టీడీపీ, వైసీపీ, జనసేన, లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలకు ఆయన సూచన చేశారు.
పాఠశాల విద్యకు రూ.28వేల కోట్లతో ప్రయోజనం లేదు
విజయవాడలో ఓ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, జయప్రకాశ్ నారాయణ పాల్గొన్నారు. వీరి మధ్య మాటల యుద్ధం నడిచింది. తొలుత జేపీ మాట్లాడారు. పాఠశాల విద్యకు ఏడాదికి రూ.28వేల కోట్ల ఖర్చు వల్ల ప్రయోజనం లేదన్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కార్పొరేట్ పాఠశాలల్లోనే పిల్లలను చదివిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఆ నిధులను సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేస్తే బాగుంటుందన్నారు.
జేపీకి గట్టి కౌంటర్ ఇచ్చిన దేవినేని
ఆ తర్వాత దేవినేని మాట్లాడారు. వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. సిద్ధాంతాలు చెబితే చింతకాయలు రాలవని, నీటి భద్రత, ప్రాజెక్టుల నిర్మాణం కోసం భార్యాపిల్లలను వదిలి కాల్వగట్ల వెంట పడుకుని నీరు అందే వరకు శ్రమించామన్నారు. హైదరాబాద్లో కూర్చుని పుస్తకాలు చదవడం, టీవీ స్టూడియోల్లో కూర్చొని మాట్లాడితే సరిపోదన్నారు.
హోదా ఎలా సాధిస్తారో చెప్పాలి
ఏపీలో అయిదేళ్ల కిందట జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమ పరిస్థితులు మళ్లీ ఇప్పుడు హోదా కోసం నెలకొన్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్ వేరుగా అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న నాయకులు అసలు హోదా ఎలా సాధిస్తారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.