ఇదో నాటకం:కన్నా;బీజేపీ కక్ష సాధింపు చర్యే:అమరనాథ్రెడ్డి;అది జనసేన కాదు...ధనసేన:తులసిరెడ్డి
అమరావతి:టీడీపీ నేతల ఇళ్లల్లో ఐటీ సోదాలు బీజేపీ కక్ష సాధింపు చర్యే నని మంత్రి అమరనాథ్రెడ్డి విమర్శించారు. సోమవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐటీ సోదాల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐటి అధికారులు పోదాలు నిర్వహించడం తప్పుకాదని...అయితే దాడుల పేరిట భయబ్రాంతులకు గురిచేసేలా ప్రవర్తించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి గతంలో తమిళనాడు, కర్ణాటకలోనూ ఇదే తరహాలో ఐటీ సోదాలు చేయించి, ఆయా పార్టీలను...నేతలను తమ దారికి తెచ్చుకునే ప్రయత్నం చేసిందని మంత్రి అమరనాథ్రెడ్డి ఆరోపించారు.
మరోవైపు ఐటి దాడుల విషయమై టిడిపి నేతల విమర్శలపై బిజెపి ఎపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఏపీలో ఐటి దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదని గతంలో ఎన్నో మార్లు ఐటీ సోదాలు జరిగాయని అన్నారు. సోమవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. మొన్నటి వరకు బాబ్లీ కేసు పేరుతో టిడిపి నేతలు నాటకాలు ఆడారని, ఇప్పుడు మళ్లీ ఐటీ దాడుల పేరుతో నాటకాలు ఆడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
తప్పుడు పనులను ప్రశ్నించిన రాజ్యాంగ సంస్థలను అవమానించడం టిడిపికి తగదని హితవు పలికారు. టీడీపీ నేతలు అక్రమ సంపాదనతో ఏదైనా చేస్తామనే ధీమాతో ఉన్నారని ఆయన విమర్శించారు. సీఎం రమేష్, సుజనా చౌదరి కంపెనీలలో ఐటీ సోదాలు చేస్తే ఎందుకంత ఉలికిపాటని కన్నా ప్రశ్నించారు. మరి టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల నివాసంలో ఐటీ సోదాలు జరిగితే టీడీపీ నేతలు ఎందుకు స్పందించలేదని కన్నా లక్ష్మీనారాయణ నిలదీశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్కు అనుకూలంగా నిశ్శబ్ద విప్లవం పరిస్థితి కనిపిస్తుందని ఆ పార్టీ నేత తులసిరెడ్డి చెప్పారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు బీజేపీని శని గ్రహంగా...టీడీపీ, వైసీపీని రాహువు, కేతువుల్లాగా చూస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ పెట్టింది జనసేన కాదు..ధన సేన అని విమర్శించారు.
సినిమా తరహాలో హెలికాప్టర్ ద్వారా జనసేన కవాతుపై పూలవర్షం కురిపించేందుకు ఏర్పాట్లు చేశారని, మరి పేదలపార్టీకి ఈ హంగామాలు చేయడానికి డబ్బులు ఎక్కడనుంచి వచ్చాయని తులసిరెడ్డి ప్రశ్నించారు. శ్రీకాకుళం ప్రజలు తుఫాన్ తాకిడికి గురై నానా అవస్థలు పడుతుంటే పవన్కళ్యాణ్ హెలికాప్టర్ నుంచి పూలు చల్లించుకుంటున్నారని...ఇది కరెక్టేనా అని మండిపడ్డారు.