నన్నెందుకు తప్పించారు:అశోక్ గజపతి...నోటీసులు జైట్లీకి ఇవ్వండి:జలీల్ ఖాన్;టిడిపి బాబ్లీ డ్రామా:బిజెపి
విజయనగరం:ఏపీ సీఎం చంద్రబాబుకు మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై టిడిపి నేతల,కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు మండిపడ్డారు మరి బాబ్లీ కేసులో నన్నెందుకు తప్పించారు?...అని కేంద్రాన్ని,మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
అలాగే చంద్రబాబుకు నోటీసులపై ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాల్యాకు సహకరించినందుకు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వండని జలీల్ ఖాన్ ఎద్దేవా చేశారు. మరోవైపు చంద్రబాబుకు నోటీసులపై బిజెపిని,కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టడాన్ని బిజెపి నేత విష్ణువర్దన్రెడ్డి తప్పుబట్టారు. తెలంగాణలో ఓట్ల కోసమే టీడీపీ బాబ్లీ డ్రామా అడుతుందన్నారు.
ఎందుకు?...తప్పించారు
బాబ్లీ ప్రాజెక్ట్ కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీపై టిడిపి సీనియర్ నేత,కేంద్ర మాజీ మంత్రి, ఆనాటి ఆందోళనలో పాల్గొన్న నాయకుడు అశోక్ గజపతి రాజు మీడియాతో మాట్లాడుతూ...బాబ్లీ ఘటన కేసు నుంచి మరి నన్నెందుకు తప్పించారు?...అని కేంద్రాన్ని,మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ వ్యవహారం మొత్తం ఖచ్చితంగా బీజేపీ రాజకీయ కుట్రలో భాగమేనన్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా ఇలాంటి పాత కేసులను తిరగదోడటం మంచిది హెచ్చరించారు.
జలీల్ ఖాన్...సంచలనం
ఇదే విషయమై ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ బ్యాంకులకు కోట్లు ఎగ్గొట్టిన విజయ మాల్యాకు సహకరించిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వడంటూ కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహా కూటమి అంటే ప్రధాని మోడీకి భయమేస్తోందని అందుకే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని ఆయన అన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణకి పేరులోనే పెద్ద కన్నం ఉందన్నారు. కన్నా అప్పట్లోనే రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచేశారని ఆరోపించారు.
వైసిపి ఎమ్మెల్యేలు...టిడిపిలో చేరిక
ఎపిలో ప్రతిపక్షం పని అయిపోయిందని, త్వరలోనే పలువురు వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరబోతున్నారని జలీల్ ఖాన్ చెప్పుకొచ్చారు. అయితే ఆ ఎమ్మెల్యేలు ఎవరన్న వివరాలను మాత్రం జలీల్ ఖాన్ వెల్లడించలేదు. వైసిపి ఫిరాయింపు ఎమ్మెల్యే అయిన జలీల్ ఖాన్ గతంలో కూడా మరో వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.
టిడిపి...బాబ్లీ డ్రామా
ఇదిలావుంటే చంద్రబాబుకు బాబ్లీ ప్రాజెక్ట్ కేసులో మహారాష్ట్ర కోర్టు వారెంట్ ఇవ్వడంపై బిజెపి, కేంద్ర ప్రభుత్వమే కారణమంటున్న టిడిపి నేతల ఆరోపణలపై భాజపా నేత విష్ణువర్దన్రెడ్డి ఘాటుగా ప్రతిస్పందించారు. నటుడు శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడపై ఎందుకు విచారణ చేపట్టలేదని ఆయన నిలదీశారు. శివాజీ టీడీపీ ముసుగు వేసుకున్న నేత అని విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు. అది ఆపరేషన్ గరుడ కాదు...ఆపరేషన్ ఇడ్లీ వడ అని ఎద్దేవాచేశారు. తెలంగాణలో ఓట్ల కోసమే టీడీపీ నేతలు బాబ్లీ డ్రామా అడుతున్నారని విష్ణువర్దన్రెడ్డి ఆరోపించారు.