ఆహా ఏమి నటన!...కాదు....మీదే నాటకం:టిడిపి,వైకాపాల మాటల యుద్ధం
అమరావతి:ప్రత్యేక హోదా కోసం అంటూ వైసిపి ఎంపిల చేసిన రాజీనామాల వ్యవహారంపై ఎపి అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతరూపం దాలుస్తోంది.
వైసీపీ ఎంపీల రాజీనామాలన్నీ నాటకాలే నంటూ టిడిపి అధినేత చంద్రబాబుతో సహా ఆ పార్టీ ముఖ్య నేతలందరూ వైసిపీపై ఆరోపణా అస్త్రాలు సంధిస్తుండగా... మరోవైపు తాముచిత్తశుద్ధితోనే తమ ఎంపీ పదవులకు రాజీనామాలు చేశామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు స్పష్టం చేస్తున్నారు. అసలు టిడిపి-బిజెపిలే నాటకాలు ఆడుతున్నాయని వైసిపి ఎంపీలు అంటున్నారు.
వైసీపీ ఎంపీల రాజీనామాలన్నీ నాటకాలే అని ఆరోపణలు సంధిస్తున్న టిడిపి ముఖ్య నేతల జాబితాలో ముఖ్యమంత్రి చంద్రబాబు,లోకేష్ తోపాటు ఎంపీలు కొనకళ్ల,కేశినేని నాని, శివప్రసాద్, జెసి దివాకర్ రెడ్డి చేరారు. వైసీపీ ఎంపీల రాజీనామాలన్నీ డ్రామాలని అని జేసీ దివాకర్రెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీ, వైసీపీ కలిసి ఆడుతున్న నాటకంలో భాగమే అని ఆరోపించారు. ఎన్నికలకు ఏడాది ఉందనగా రాజీనామా చేస్తే ఉపఎన్నికలు రావని వైసీపీ ఎంపీలకు తెలుసన్నారు. రాజీనామాలు ఆమోదించే విషయంలో స్పీకర్ కావాలనే జాప్యం చేస్తున్నారని ఎంపీ జేసీ ఆరోపించారు.
వైసీపీ ఎంపీలు జనాల చెవిలో పూలు పెడుతున్నారని... అంటూ చెవిలో పువ్వులు, క్యాలీఫ్లవర్ పెట్టుకుని మరీ చూపిస్తూ ఎంపీ శివప్రసాద్ వైకాపాను ఎద్దేవా చేశారు. కళాకారుడిగా వినూత్నరీతిలో ఈ విధంగా తన నిరసన తెలిపానని ఎంపీ అన్నారు. అంతకుముందు వైసీపీ ఎంపీల రాజీనామాల వ్యవహారంపై మంత్రి నారాలోకేష్ ట్విట్టర్లో స్పందించారు. ఏమి నటన...ప్రజలను మభ్యపెట్టి, బీజేపీతో కుమ్మక్కై ఉప ఎన్నికలు రాకుండా జాగ్రత్త పడ్డారని వ్యాఖ్యానించారు. రాజీనామాల డ్రామా ఆడిన వైసీపీ ఎంపీలకు 'భాస్కర్' అవార్డులు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలు వారి సొంత కథతో 'ఏ1...అర డజను దొంగలు' సినిమా తీస్తే బాగుంటుందని ట్విట్టర్లో మంత్రి లోకేష్ వ్యంగ్ర్యాస్త్రాలు సంధించారు.
మరోవైపు టిడిపి నేతల ఆరోపణలపై వైకాపా ఎంపి వైవీ సుబ్బారెడ్డి ప్రతిస్పందించారు. ఇదే విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజీనామాల ఆమోదం కోసం స్పీకర్ను మళ్లీ కలుస్తామని అన్నారు. బీజేపీ, టీడీపీలే డ్రామాలాడుతున్నాయని ఆయన విమర్శించారు. ఎవరితోనూ రాజీపడాల్సిన అవసరం తమకు లేదని, టీడీపీ నేతలే రోజుకో డ్రామా ఆడుతూ ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. ముందుగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టింది వైసీపీ అని వైవీ సుబ్బారెడ్డి గుర్తుచేశారు.