విభజన హామీలు: హరిబాబుపై ధ్వజమెత్తిన నేత, మధ్యలోనే కామినేని బయటకు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై విజయవాడలో ఆదివారం జరిగిన పదాధికారుల సమావేశంలో వాగ్యుద్ధం జరిగింది. మంత్రి కామినేని శ్రీనివాస రావు సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు.
Recommended Video
తాను మధ్యలో సమావేశం నుంచి బయటకు రావడంపై మంత్రి వివరణ ఇచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీని సమర్థిస్తూ బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ పదాధికారుల సమావేసం వాడివేడిగా సాగింది.
హరిబాబుపై లక్ష్మీపతి రాజా ధ్వజం
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, ఎంపి కంభంపాటి హరిబాబుపై పార్టీ సీనియర్ నేత లక్ష్మీపతి రాజా ధ్వజమెత్తారు. ఓం శాంతి అని హరిబాబు అంటే సరిపోదని లక్ష్మీపతి రాజా అన్నారు. అదే సమయంలో టిడిపి నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. దాంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.
వారించిన పురంధేశ్వరి, ఇతర నేతలు
లక్ష్మీపతి రాజాను మంత్రి మాణిక్యాలరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, పురంధేశ్వరి వారించారు. హరిబాబు ఢిల్లీలో చెప్పిన విషయాలనే సమావశంలో చెప్పారు.
టిడిపి మాధవ్ నిప్పులు
బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ అధ్యక్షతను వన్ టౌన్లో బిజెపి కార్యకర్తల సమావేశం జరిగింది. టిడిపి నాయకులు దుర్మార్గులని ఆయన ఆ సమావేశంలో దుయ్యబట్టారు. బిజెపి జాతీయ నాయకత్వం ఇచ్చిన వివరాలను సమావేశంలో వినిపించారు.
అనారోగ్యం వల్లనే వెళ్లా..
అనారోగ్యం వల్లనే ఆదివారంనాటి బీజేపీ సమావేశం నుంచి బయటకు వచ్చానని మంత్రి కామినేని శ్రీనివాస రావు స్పష్టం చేశారు. సమావేశంలో ఉన్న నేతల అనుమతి తీసుకొని బయటకు వెళ్లానని ఆయన సోమవారం మీడియా సమావేశంలో చెప్పారు. రెండు రోజులుగా తాను జ్వరంతో బాధపడుతున్నానని, ఈ విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు.