ప్రధాని మోడీకి జివిఎల్ ఊడిగం:బుద్ధా వెంకన్న;అభివృద్ది గాలి కొదిలేసిన ప్రభుత్వం:కన్నా
విజయవాడ: పిడి అకౌంట్ల విషయమై టిడిపి ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీకి ఊడిగం చెయ్యటమే జీవిఎల్ స్వభావమన్నారు.
జీవిఎల్ ఏపీ వాసి అయ్యుండి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. 100 మంది రాజ్యసభ సభ్యులను తయారు చేసిన ఘనుడు చంద్రబాబు అంటూ ప్రస్తుతించారు. బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజుకి పదవులే ముఖ్యమని, దమ్ముంటే కన్నా అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని బుద్దావెంకన్న బిజెపిని డిమాండ్ చేశారు.
మరోవైపు టిడిపి ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ విమర్శల వర్షం కురిపించారు. ప్రత్యేక హోదా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసిందని కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం నులకపేటలో నిర్మించనున్న రాష్ట్ర పార్టీ కార్యాలయ స్థలాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు.
ఈ నెల 16న కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేసేందుకు రానున్నట్లు కన్నా వెల్లడించారు. ఐదు అంతస్తుల్లో నిర్మించే భవనాన్ని ఏడాది లోపు పూర్తి చేస్తామని కన్నా తెలిపారు. పార్టీ కార్యాలయం పూర్తయితే రాష్ట్రంలో బిజెపి కార్యకలాపాలు మరింత జోరందుకుంటాయని కన్నా అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో జగన్, తెలుగుదేశం కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని...అయినా ఈ అంశంపై ఎవరూ మాట్లాడటం లేదని కన్నా లక్ష్మీనారాయణ తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ఇస్తామని చెప్పినా తమ మాట ఎవరూ వినడం లేదని కన్నా అసహనం వ్యక్తం చేశారు.