మండలిలో మాటల యుద్ధం.. సోము వీర్రాజు వర్సెస్ పయ్యావుల కేశవ్
అమరావతి: ఏపీ శాసనమండలిలో గురువారం టీడీపీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపిన ఘనత బీజేపీదే అని సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను పయ్యావుల కేశవ్ ఖండించారు. సోము వీర్రాజు అసత్యాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లింది ముంపు మండలాల కోసమేనని కేశవ్ పేర్కొన్నారు.
తాము స్లిప్పుల ద్వారా పంపిన అంశాలనే ఆనాడు వెంకయ్యనాయుడు రాజ్యసభలో మాట్లాడారని, ఈ విషయాన్ని సోము వీర్రాజు తెలుసుకోవాలని పయ్యావుల కేశవ్ సూచించారు. రాయలసీమకు డ్రిప్ ఇరిగేషన్ కూడా కేంద్రం వల్ల రాలేదని, చంద్రబాబు వల్లే వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ, తాను మాట్లాడే ప్రతిసారి అడ్డు తగలడం మంచి పద్ధతి కాదంటూ టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.