పరాయిదేశంలో చిత్రహింసలు: ఏపీ మహిళను కాపాడిన వరంగల్ పోలీసులు
వరంగల్: పరాయి దేశంలో చిత్రహింసలకు గురవుతున్న కడపకు చెందిన మహిళను కాపాడి వరంగల్ కమిషనరేట్ పోలీసులు తమ ఔదార్యం చాటారు. వరంగల్ పోలీసు కమిషనర్ సుధీర్బాబు సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. జూన్ 7న కమిషనరేట్ ఫోన్ నంబర్కు వాట్సాప్ ద్వారా ఓ వీడియో వచ్చింది.
రియాద్లో చిక్కుకుని ఓ తెలుగు మహిళ పడుతున్న ఇబ్బందులను వాట్సాప్ ద్వారా తన బంధువులకు పంపించగా, అది కాస్తా పోలీసు కమిషనరేట్కు వచ్చింది. కమిషనర్ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపి ఆమె గురించి ఆరా తీశారు. ఆమెను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా సిద్దవటం మండలం లక్ష్మీపురానికి చెందిన సుబ్బలక్ష్మిగా గుర్తించారు.
సుబ్బలక్ష్మి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. దుబాయిలో కూలీ పని కోసం వెళ్లేందుకు మధ్యవర్తులు జిలానీ, వలీ వెంకటేశ్ను ఆశ్రయించింది. వారికి రూ.80 వేలు ఇచ్చింది. వారు ఆమెను దుబాయికి కాకుండా రియాద్ దేశంలోని అబ్దుల్లా షేక్కు రూ.2 లక్షలకు విక్రయించారు. ఆమె నెల రోజులపాటు అతని వద్ద పని చేసింది. ఆ తర్వాత అనారోగ్యానికి గురైంది.

గుండె సంబంధిత వ్యాధితో ఆమె బాధపడుతోందని వైద్యులు చెప్పడంతో షేక్ ఆమెను ఇరుకైన మరుగుదొడ్డిలో బంధించి వేధించడం మొదలుపెట్టాడు. ఈక్రమంలో సుబ్బలక్ష్మి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఆమె పడుతున్న బాధలను అక్కడ ఉన్న ఓ మహిళ సెల్ఫోన్లో చిత్రీకరించి, కువైట్లో ఉన్న బంధువులకు పంపారు. వారు ఆమె సోదరుడికి పంపించారు.
కాగా, ఈక్రమంలో ఆ వీడియో అనుకోకుండా వరంగల్ పోలీస్ కమిషనరేట్కు చేరింది. తెలుగు మహిళ కావడంతో చొరవ చూపిన పోలీసులు.. రూ.2 లక్షలను అబ్దుల్లాషేక్కు చెల్లించి ఆమెను వరంగల్ తీసుకొచ్చారు. అనంతరం స్వస్థలానికి పంపించారు. వరంగల్ పోలీసు కమిషనర్ తనకు పునర్జన్మనిచ్చారని బాధిత మహిళ సుబ్బలక్ష్మి ఆనందం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications