ఆయుధాల్లేని యుద్ధం- నర్సీపట్నం డాక్టర్ ఎపిసోడ్ నేర్పుతున్న పాఠం...
ఏపీలో కరోనా వైరస్ పై పోరాటం చేస్తున్న వైద్యులు, ఇతర సహాయక సిబ్బందికి నాణ్యమైన మాస్కులు కానీ ఇతర వ్యక్తిగత రక్షణ కిట్లు గానీ తగినంత మేర అందుబాటులో లేవు. తాజాగా విశాఖ మెడ్ టెక్ జోన్ లో కిట్ల తయారీ ప్రారంభమైందని అధికారులు చెబుతున్నా అవి ఎప్పటికి అందుతాయో తెలియని పరిస్ధితి. ఇదే సమయంలో నిన్న అనంతపురం ప్రభుత్వం ఆస్పత్రిలో ఇద్దరు వైద్యుల సహా మరో ఇద్దరు సహాయక సిబ్బందికి సైతం కరోనా సోకడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న తమకు రక్షణ కిట్లు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించిన నర్సీపట్నం డాక్టర్ పై ప్రభుత్వం వేటు వేయడంపై చర్చ జరుగుతోంది.
ఆయుధాల్లేని యుద్ధం...
యుద్ధం చేయాలంటే ఆయుధం తప్పనిసరి. కానీ కరోనా వైరస్ పై యుద్దం చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వాలకు తగినన్ని ఆయుధాలు అందుబాటులో ఉన్నాయా అంటే అవునని కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అతి తక్కువ సమయంలో ప్రపంచ స్ధాయి మహమ్మారితో భారీ ఎత్తున సమయస్ఫూర్తితో యుద్ధం చేయాల్సిన పరిస్దితులే ఇందుకు ప్రధాన కారణం. అప్పటివరకూ కరోనాను నిర్దారించే కిట్లే అందుబాటులో లేని పరిస్దితుల్లో ఈ పోరును ప్రారంభించిన ప్రభుత్వాలకు డాక్టర్లకు సరైన కిట్లు అందిస్తే తప్ప వైరస్ వ్యాప్తి చెందకుండా ఆపలేమనే ఆలోచన లేకుండా పోయింది.
ముందే చేతులెత్తేసిన డాక్టర్లు....
వ్యక్తిగత రక్షణ కిట్లు లేకుండా కరోనా వంటి మహమ్మారికి చికిత్స చేయాలంటే పరిస్ధితి ఎలా ఉంటుందో ప్రతీ డాక్టర్ కూ తెలుసు. వారికి సహాయకులుగా ఉంటున్న లక్షల మందికి ఇంకా బాగా తెలుసు. కాబట్టి వ్యక్తిగత రక్షణకు పీపీఈ కిట్లు, నాణ్యమైన మాస్కులు ఇవ్వాలని వారు కోరుతూ వచ్చారు. చాలా చోట్ల ఉన్నతాధికారుల నుంచి స్పందన రాకపోవడంతో విధులకు రాలేమని కూడా చెప్పేశారు. ప్రభుత్వం చివరికి జోక్యం చేసుకుని ఏకంగా ఎస్మా పరిధిలోకి వారిని తీసుకొచ్చేసింది. అయినా ప్రాణాలు వదులుకోలేక, ఉద్యోగాలను వదులుకుంటామని కూడా డాక్టర్లు పలుచోట్ల ఆందోళనకు దిగారు. చివరికి నర్సీపట్నం డాక్టర్ రూపంలో వారి ఆవేదన ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
నర్సీపట్నం ఘటనపై ప్రభుత్వం..
వాస్తవానికి నర్సీపట్నం ఘటనలో డాక్టర్ సుధాకర్ ప్రభుత్వానికి వేసిన ప్రశ్నల్లో చాలా వరకూ సహేతుకంగానే ఉన్నాయి. 15 రోజులకో మాస్కు వాడమంటున్నారని, వ్యక్తిగత రక్షణ కిట్లు లేకుండానే వైద్యం చేయాలని బెదిరిస్తున్నారని సుధాకర్ చెప్పుకొచ్చారు. స్ధూలంగా చెప్పాలంటే ఆయుద్ధాలేని యుద్ధం చేయాలని తమను ఒత్తిడి చేస్తున్నారనే విషయాన్ని సుధాకర్ బయటపెట్టారు. కానీ ఇది కాస్తా గంటల్లోనే రాజకీయ రంగు పులుముకోవడంతో ప్రభుత్వం సుధాకర్ ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది. అయినా రాజకీయ నేతల మధ్య మాటల యుద్దం మాత్రం ఆగడం లేదు.
నర్సీపట్నం ఘటన చెబుతున్న పాఠం..
ఆయుధాల్లేని యుద్ధానికి ఏ సైనికుడూ సిద్దం కాలేడు. సన్నద్ధత లేకుండా యుద్ధం చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ కోణంలో చూస్తే ప్రభుత్వానికి నర్సీపట్నం డాక్టర్ వేసిన ప్రశ్నలు సమంజసమే. అతను ఎంచుకున్న మార్గం తప్పే కావచ్చు కానీ చెప్పాలనుకున్న విషయం మాత్రం కచ్చితంగా సరైనదేనని ఇప్పుడు అందరూ అంగీకరించక తప్పని పరిస్ధితి. అప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వేలాది డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యను డాక్టర్ సుధాకర్ బయటికి తీసుకొచ్చారు. దీన్ని ప్రభుత్వం పాజిటివ్ గా తీసుకుంటే ఎస్మా ప్రయోగించాల్సిన అవసరం లేకుండానే వైద్యులు విధులకు హాజరయ్యే అవకాశముంది. కానీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించిన తర్వాత కూడా సుధాకర్ వంటి డాక్టర్ల నుంచి ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయంటే దాన్ని సానుకూల కోణంలో చూసి ప్రభుత్వం కరోనా పై పోరులో వైద్యులకు తగిన సామాగ్రిని అందుబాటులో ఉంచాలనే డిమాండ్ వినిపిస్తోంది.
Recommended Video