ప్రశాంత్ కిషోర్ చుట్టూ ఢిల్లీ రాజకీయం, ఉన్నారా లేరా: అసలేం జరిగింది?
అమరావతి: ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ బీజేపీని టార్గెట్గా చేసుకుంది. ఏపీకి ఏమీ చేయలేదని, ఇన్నాళ్లు ఓపిక పట్టామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ, వైసీపీ, జనసేన పైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మూడు పార్టీలు కలిసి టీడీపీని దెబ్బతీయాలని చూస్తున్నాయని, తమిళనాటు తరహా పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు.
ప్రశాంత్ కిషోర్తో అనూహ్య మలుపు
ఇలాంటి సమయంలోనే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. బీజేపీ మీటింగ్లో ఆయన ఉన్నారనే వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అయితే ప్రశాంత్ కిషోర్ 2019 ఎన్నికలకు బీజేపీతో కలిసి పని చేస్తారని గతంలో కూడా ప్రచారం సాగింది. అయితే, ఇది అనూహ్య మలుపు తిరిగి ఏపీలో బీజేపీ, వైసీపీ ఒక్కటయ్యే దిశగా ఉంటున్నాయని టీడీపీ అనుమానిస్తోంది.
ప్రశాంత్ కిషోర్ పేరుతో బీజేపీని టార్గెట్ చేస్తున్న టీడీపీ
ఇదిలా ఉండగా, ఢిల్లీలో బీజేపీ అధిష్టానంతో జరిగిన భేటీలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇది ఇప్పుడు కలకలం రేపుతోంది. ఏపీ రాజకీయాల్లో ఇది సంచలనంగా మారింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దీనినే టార్గెట్ చేస్తోంది.
బీజేపీ భేటీలో ప్రశాంత్ కిషోర్ ఉన్నారా?
బీజేపీ భేటీలో ప్రశాంత్ కిషోర్ ఉన్నారట కదా అని ఏపీ బీజేపీ నేతలను ప్రశ్నిస్తే ఆయన వచ్చారని, కానీ ఆయన తమతో కలిసి భేటీలో కూర్చోలేదని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే వారు సెటైరిక్గా చెప్పారా లేక నిజంగానే చెప్పారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
ప్రశాంత్ కిషోర్ విషయంలో అసలేం జరిగింది?
ఏపీ బీజేపీ నేతలు ప్రశాంత్ కిషోర్ పైన చేసిన వ్యాఖ్యలు అలా ఉండగా, ప్రశాంత్ కిషోర్ ఆఫీస్ మాత్రం మరో విధంగా స్పందించింది. అసలు ఆయన ఢిల్లీలోనే లేరని పేర్కొన్నారు. దీంతో ఏది నిజమనే చర్చ సాగుతోంది. టీడీపీ చెప్పినట్లు ఆ భేటీలో పాల్గొన్నారా, లేక ఢిల్లీలోనే లేరా, బీజేపీ నేతలు వ్యంగ్యంగా చెప్పారా అనేది తేలాల్సి ఉంది. టీడీపీ నేతలు మాత్రం ప్రశాంత్ కిషోర్ బీజేపీ నేతలతో కలిసి భేటీ అయ్యారని చెబుతూ టార్గెట్ చేస్తున్నారు.