స్మార్ట్ ఫోన్లో పోర్న్ వీడియోలు చూసే...బాలికలపై అత్యాచారాలు:నన్నపనేని
కర్నూలు:స్మార్ట్ ఫోన్లో అశ్లీల వీడియోలు చూడడం వల్లే బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి విశ్లేషించారు.
మనిషి సాంకేతికత వైపు అడుగులు వేస్తున్నాడని సంబరపడిపోవాలో...దాని ముసుగులో యువత పక్కదారి పడుతుండడం చూసి బాధపడాలో అర్థం కావడం లేదన్నారు. మహిళలపై దాడులను ఎందుకు అరికట్టలేక పోతున్నామో ఆలోచించాలన్నారు. కర్నూలు కలెక్టరేట్ లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో 'మహిళా భద్రత-మనందరి బాధ్యత' అంశంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
టివి సీరియళ్లు...ఆడవాళ్లే శత్రువులు
అలాగే టీవీ సీరియళ్లు చూసి ఆడవాళ్లకు ఆడవారే శత్రువులుగా మారుతున్నారని నన్నపనేని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. మన సంస్కృ తి, సంప్రదాయాలు, కట్టుబాట్లకు అనుగుణంగా నడుచుకుని భద్రత సృష్టించుకోవాలని ఆమె సూచించారు. మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించినప్పుడే దేశం పురోగమిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు.
గతంలో అలా...ఇప్పుడు ఇలా!
గతంలో ప్రతి ఇంటిలో ఆడవారిపై వివక్షతో చదివించకుండా, వివిధ రంగాలలో రాణించేందుకు ప్రోత్సహించకుండా ఉండేవారని అన్నారు. ప్రస్తుత సమాజంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోవడంతో మహిళలు విద్య, క్రీడలు, ఉద్యోగం, అన్నిరంగాలలో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారని అన్నారు. అయితే సమాజంలోని మృగాలు పసి బాలలపై, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిని వదలకుండా మరణ శిక్ష విధించాలని ఆమె అన్నారు.
అమ్మాయిలు...భారం కాదు
రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ దురలవాట్లకు దూరంగా ఉన్న తన కంపెనీలో పని చేసే ఉద్యోగులకు నెలకు రూ.1500లను వారి భార్య, లేదా తల్లి ఖాతాల్లో జమ చేస్తున్నానన్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్రెడ్డి మాట్లాడుతూ అమ్మాయిని తల్లిదండ్రులు భారంగా భావించరాదన్నారు. మహిళల ఆర్థిక బలోపేతానికి ముఖ్యమంత్రి నెలకు రూ.10 వేలు సంపాదించుకునే అవకాశం కల్పిస్తున్నారన్నారు. చిన్న తరహాపరిశ్రమల ఏర్పాటుచేసే మహిళలకు ప్రభుత్వం 40శాతం సబ్సిడీ ఇస్తోందన్నారు.
బంధువులే...రాబందులు
ఎస్పీ గోపినాథ్జెట్టి మాట్లాడుతూ మహిళల చట్టాల గురించి తెలుసుకొని వాటిని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు.ఎస్పీ గోపినాథ్జెట్టి మాట్లాడుతూ 95 శాతం బంధువులు, చుట్టుపక్కల వారి వల్లే చిన్న పిల్లలపై అఘాయిత్యాలు జరగుతున్నాయన్నారు. బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై తల్లిదండ్రుల దృష్టి పెట్టాలన్నారు ప్రస్తుత సమాజంలో యువతులు, మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, సమస్య పరిష్కారానికి ఆత్మహత్య పరిష్కారం కాదని, వాస్తవాలను బేరీజు వేసుకొని సమస్యను పరిష్కరించుకునే దిశగా మహిళలు అడుగులు వేయాలని సూచించారు.