రాయలసీమ డ్యాముల్లో పడిపోతున్ననీటిమట్టాలు...రైతుల్లో ఆందోళన
Recommended Video
రాయలసీమ జిల్లాలకు సాగునీరు,తాగునీరు అందించే శ్రీశైలం, తుంగభద్ర డ్యామ్లలో నీటిమట్టాలు భారీగా పడిపోవడం ఆ ప్రాంత వాసుల్లో ఆందోళన రేపుతోంది. ఇంకా వేసవి మొదలు కాకముందే శ్రీశైలం ప్రాజెక్టులో నీరు కనీస నీటి మట్టం కంటే దిగువకు పడిపోయింది. మరోవైపు తుంగభద్ర డ్యామ్ లోనూ నీటి పరిస్థితి ఆందోళనకరంగానే ఉండటం గమనార్హం.
చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన
శ్రీశైలం డ్యామ్ లో కనీస నీటిమట్టం 834 అడుగులు ఉండాల్సి వుండగా మార్చి 21 నాటికి ఇది 816 అడుగుల దిగువకు పడిపోయింది. రాయలసీమకు తాగు,సాగునీరు అందించడంలో ప్రధాన ప్రాజెక్ట్ శ్రీశైలం డ్యామ్ కు ఈ పరిస్థితి రావడానికి కారణం ఆంధ్ర, తెలంగాణాల ఉమ్మడి రిజర్వాయరు అయిన శ్రీశైలం డ్యామ్ నుంచి ఈ రెండు రాష్ట్రాలు పోటీ పడి నీళ్లను తోడుకోవడమే. దీంతో వేసవికి ముందే ఈ డ్యామ్ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది.
అలాగే పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి తెలుగుగంగ ఎస్ఆర్బిసిలోకి నీటిని తీసుకోవాలంటే అందులో నీటి మట్టం 840 అడుగులకు పైగా ఉండాలి. అయితే శ్రీశైలం డ్యామ్లో 810 అడుగుల దాకా నీటిమట్టం పడిపోయినప్పటికీ ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి కూడా నీటిని తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో 38.5 టిఎంసిల నీరు అందుబాటులో ఉన్నట్లు తెలిసింది. అందువల్ల ఈ ప్రాజెక్టు నుంచి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా కెసి కెనాల్లోకి 741 క్యూసెక్కులు, హంద్రీనీవాలోకి 338 క్యూసెక్కులను వదులుతున్నట్లు సమాచారం. ఈ తరలింపు మరో వారం రోజులు పాటు కొనసాగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంటున్నారు.
ఇక నీటి అవసరతల విషయానికొస్తే శ్రీశైలం డ్యామ్లో కనీస నీటి నిల్వలు నిలకడగా ఉంటేనే వేసవిలో తాగునీటి అవసరాలతోపాటు ఖరీఫ్కు ముందుగానే సాగునీరు అందించడం సాధ్యపడుతుంది. అయితే ప్రభుత్వాలు ముందుచూపు లేకుండా ఈ రిజర్వాయరును ఖాళీ చేయించడం పట్ల రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక మరోవైపు తుంగభద్ర డ్యామ్లోనూ నీటి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కేవలం 6.12 టిఎంసిలు మాత్రమే ఉంది. కర్ణాటక లో అదనపు జలాల వినియోగం కారణంగా ఆంధ్రాలోకి కేవలం 200 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోందని సమాచారం.