రాజధాని అమరావతి కోసం కృష్ణా నదిలో జలదీక్ష..నల్ల బెలూన్లతో నిరసన
Recommended Video
రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ఇంకా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని రైతులకు మద్దతుగా పలు ప్రాంతాల్లో సైతం నిరసనలు, రిలే దీక్షలు కొనసాగుతున్నాయి . అమరావతి గ్రామాల్లోనూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.ఏపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలతో రాజధాని అమరావతి ప్రాంతం మార్మోగుతుంది.
కృష్ణా నదిలో జలదీక్ష చేసిన రైతులు, మహిళలు
ఇక తాజా పరిణామాల నేపధ్యంలో రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా రైతులు వినూత్నంగా నిరసనలు చేపడుతున్నారు. కృష్ణా నదిలో రాజధాని మహిళలు, రైతులు జలదీక్షకు దిగారు. జై ఆంధ్రప్రదేశ్, సేవ్ రాజధాని అంటూ నినాదాలు చేస్తున్నారు. శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ ఫొటో పట్టుకుని ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ప్రజాస్వామ్య బద్ధంగా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు .
42 రోజులుగా నిరసనలు... సర్కార్ తీరుపై అసహనం
42 రోజులుగా తాము నిరసనలు చేపడుతున్నా ప్రభుత్వంలో కదలిక లేకపోవడం అన్యాయమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని పోరాటాలు చేసయినా తాము తమ హక్కు అయిన రాజధానిని కాపాడుకుంటామని చెప్పారు. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పారు.ప్రాణాలను ఇవ్వటానికి అయినా సిద్ధం గా ఉన్నామని రాజధాని అమరావతి త్రాలిపోవటం మాత్రం వీలు లేదని రైతులు పేర్కొన్నారు.
శాసనమండలి రద్దుకు నిరసనగా నల్ల బెలూన్స్ వదిలి నిరసన
ఇక అంతే కాదు రాజధాని అమరావతి కోసం అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని నిర్ణయం తీసుకుంది శాసనమండలి. ఇక దీంతో బిల్లు ఆమోదం పొందలేదని మండలిని రద్దు చేసింది వైసీపీ ప్రభుత్వం . దీంతో శాసన మండలి రద్దును వ్యతిరేకిస్తూ మందడంలో నల్లబెలూన్స్ను వదలి నిరసన తెలిపారు రాజధాని రైతులు. వికేంద్రీకరణ బిల్లులను మండలి సెలెక్ట్ కమిటీకి పంపడంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ నిర్ణయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు స్థానికులు .