2020 లో ఏపీ, తెలంగాణాల మధ్య వాటర్ వార్ ..రాయలసీమ ఎత్తిపోతలతో మొదలై కేంద్రం కోర్టులో సాగుతూ ..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య 2020 సంవత్సరంలో జల జగడాలు కొనసాగాయి. గతంలో ఉన్న నదీజలాల వాటాల పంచాయతీలకు తోడు రాయలసీమ ఎత్తిపోతల పథకం తో మొదలైన రగడ ఇరు రాష్ట్రాలు సుప్రీం కోర్ట్ మెట్లెక్కే వరకు వెళ్లాయి. ఏపీ సర్కార్ జాతీయ హరిత ట్రిబ్యునల్ విచారణ ఎదుర్కొంది . కృష్ణా బోర్డు , గోదావరి నదీ యాజమాన్య బోర్దులకు తలనొప్పిగా మారాయి . జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎం అయిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతాయి, జల వివాదాలు పరిష్కారమవుతాయి అందరూ భావిస్తే అందుకు భిన్నంగా వాటర్ వార్ తెలుగు రాష్ట్రాల్లో పీక్స్ కి చేరుకుంది. కేంద్రం జోక్యం చేసుకునే వరకు వెళ్లింది. ఏకంగా కేంద్రమంత్రి రంగంలోకి దిగి రెండు రాష్ట్రాల నదీజలాల వాటాల పంచాయతీ కేంద్ర జలవనరుల శాఖ పరిధిలో, రెండు నదీ బోర్డుల పరిధి నోటిఫై చేశాక వారి నిర్ణయం మేరకు జరుగుతుందని తేల్చే వరకు వెళ్ళింది. పిట్ట పోరు, పిట్ట పోరు పిల్లి తీర్చినట్లయ్యింది .
2020లో ఏపీలో విషం చిమ్మిన విషాదం , భయానక దృశ్యం .. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన
రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో మొదలైన జలజగడం
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం రెండు రాష్టాల మధ్య చిలికి చిలికి గాలివానలా మారింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని సీఎం కేసీఆర్ ది ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు వేగంగా పావులు కదిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలను అదనంగా వినియోగించుకోవాలని రాయలసీమ ప్రాంతానికి నీటిని అందించాలని నిర్ణయం తీసుకుని ఆ దిశగా అడుగులువేసింది .
సుప్రీం కోర్టు మెట్లెక్కిన తెలంగాణా .. కృష్ణా బోర్డుకు ఫిర్యాదు
వృధా జలాలను మాత్రమే తాము వినియోగించుకోనున్నట్లుగా ఏపీ ప్రభుత్వం తేల్చిచెప్పినా ఒప్పుకునేదే లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. సీఎం జగన్ నిర్ణయం ఏకపక్షమని మండిపడ్డారు . ఈ ఈ విషయంలో మొదటి నుంచి విభేదించిన తెలంగాణ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల ఉత్తర్వులు రద్దు చేయాలని టెండర్ ప్రక్రియ చేపట్టకుండా చూడాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతుందని ఈ పిటిషన్లో పేర్కొంది. అంతేకాదు కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది తెలంగాణా ప్రభుత్వం .
తెలంగాణా సాగునీటి ప్రాజెక్ట్ లపై రివర్స్ అటాక్ చేసిన ఏపీ .. రెండు రాష్ట్రాల నీటి లెక్కలు చెప్పాలని కృష్ణా బోర్డు ఆదేశం
తెలంగాణా ప్రభుత్వానికి కౌంటర్ గా ఏపీ కూడా కృష్ణా బోర్డులో తెలంగాణలో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్ లపై ఫిర్యాదులు చేశారు . అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే ప్రాజెక్ట్ లు రీ డిజైన్ చేశారని, ఎత్తు పెంచారని ఫిర్యాదులు చేశారు . ఇరు రాష్ట్రాల వాదనలు విన్న కృష్ణా బోర్డు కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్ట్ లకు సంబంధించి సమగ్ర వివరాలను బోర్డుకు ఇవ్వాలని పేర్కొంది . ఇదే సమయంలో రాయలసీమ పథకంపై తెలంగాణకు చెందిన గవినోళ్ళ శ్రీనివాస్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ పై చెన్నైలోని ఎన్జీటీ ధర్మాసనం విచారణ నిర్వహించింది.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై ఎన్జీటీ లో వాదనలు .. ఏపీ సర్కార్ ను సమర్ధించిన కేంద్రం కౌంటర్ దాఖలు
ఎన్జీటీ లో పిటిషనర్ తరపు వాదనలు, ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు విన్న తర్వాత తీర్పును కూడా రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ కేసు విషయంలో తమ వైఖరి ఏంటో వారం రోజుల్లో తెలియజేయాలని కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది . రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పాత పథకమే అని , దానివల్ల అదనపు ఆయకట్టు సాగులోకి వచ్చే అవకాశం ఏ మాత్రం లేదని కేంద్రం స్పష్టం చేసింది . ఇందులో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని తేల్చి చెప్పింది . ఈ కేసులో తీర్పు రిజర్వ్ చేసిన ఎన్జీటీ సుప్రీం లో కేసు విచారణలో ఉన్నందున తీర్పును వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది .
ఉప నదుల నీటి లెక్కలు చెప్పమన్న కృష్ణా బోర్డు .. లెక్క చెయ్యని ఇరు రాష్ట్రాలు
ఇక రాయలసీమ ఎత్తిపోతలతో మొదలైన జలవివాదం రెండు రాష్ట్రాలలో నీటి వినియోగం , ప్రాజెక్ట్ ల నిర్మాణం పై కృష్ణా బోర్డు దృష్టి సారించేలా చేసింది . కృష్ణా నదిపై జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ తదితర ప్రాజెక్టులకు వస్తున్న కృష్ణా జలాలు, ఆ నీటి వినియోగానికి సంబంధించిన వివరాలను కృష్ణా బోర్డుకు తెలుగురాష్ట్రాలు సమర్పిస్తున్నట్లుగానే కృష్ణా బేసిన్ లోని ఉపనదులలో ఉన్న నీటి వినియోగం లెక్కలను కూడా సమర్పించాలని కృష్ణా బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఉప నదుల నీటి లెక్కలపై స్పష్టత ఉంటేనే నీటి కేటాయింపులు, వినియోగం పారదర్శకంగా ఉంటాయని రెండు రాష్ట్రాలకు తెలిపింది.అయినా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కృష్ణాబోర్డు అడిగిన లెక్కలను ఇప్పటివరకు సమర్పించలేదు. దీంతో పలుమార్లు కృష్ణా బోర్డు కేంద్రానికి రెండు రాష్ట్రాల వ్యవహార శైలిని నివేదిస్తూ లేఖలు రాసింది .
గత ఏడాది వినియోగించుకోని నీటి విషయంలో మరో వివాదం .. కేంద్రాన్ని ఆశ్రయించిన కృష్ణా బోర్డు
ఇదిలా ఉంటే మరోపక్క గత ఏడాది వినియోగించుకోని నీటిని ఈ ఏడాది వినియోగించుకోవటానికి అనుమతి కావాలని తెలంగాణా సర్కార్ కృష్ణా బోర్డును కోరటం మరో వివాదంగా మారింది . ఏపీ సర్కార్ అలా వినియోగించుకోవటానికి వీలు లేదని తేల్చి చెప్పింది. ఇరు రాష్ట్రాలు ఎవరి వాదన వారు బలంగా వినిపిస్తున్న సమయంలో ఏపీ,తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నది జలాల వినియోగంపై కేంద్రానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు లేఖ రాసింది. కృష్ణా నదీ జలాల్లో గత ఏడాది నీటి వాటాలో వినియోగించుకోకుండా మిగిలిన నీటిని తర్వాత సంవత్సరం ఉపయోగించుకోవచ్చా? లేదా? అన్న అంశంపై కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి కృష్ణానది యాజమాన్య బోర్డు లేఖ రాసింది.
రంగంలోకి దిగిన కేంద్రం .. అపెక్స్ కౌన్సిల్ భేటీ
దీంతో కేంద్రం రంగంలోకి దిగింది. అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించి జల జగడాన్ని పరిష్కరించాలని నిర్ణయం తీసుకుంది . కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ భేటీ రెండుసార్లు అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. మొదటిసారి ఆగస్టు 5వ తేదీన సమావేశం జరగాల్సి ఉండగా సీఎం కేసీఆర్ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరారు. ఆ తర్వాత మరో మారు సమావేశం నిర్వహించాలని భావించగా, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో మరోమారు అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా పడింది.
అపెక్స్ కౌన్సిల్ భేటీలో కీలక నిర్ణయాలు .. కేంద్రం చేతిలోకి పెత్తనం
అక్టోబర్ 6 వ తేదీన అపెక్స్ కమిటీ భేటీ జరగ్గా ఎవరి వాదన వారు బలంగా వినిపించారు . కృష్ణా గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టుల విషయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో గజేంద్ర సింగ్ షెకావత్ జోక్యం చేసుకొని ఇరు రాష్ట్రాలు ఆయా ప్రాజెక్టుల డీపీఆర్ సమర్పించాలని, తదుపరి ఆదేశాలు వచ్చేదాకా వాటిని ఆపివేయాలని స్పష్టం చేశారు దీంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులను కేంద్రం తన చేతిలోకి తీసుకున్నట్లుగా అయింది. త్వరలోనే కృష్ణ గోదావరి బోర్డుల పరిధి నోటిఫై చేసి నోటిఫికేషన్ జారీ చేస్తామని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్పష్టం చేసింది. నదీజలాల అంశంలో జోక్యం చేసుకున్న కేంద్రం ప్రస్తుతం పెత్తనం తీసుకున్నట్లు అయింది. రెండు రాష్ట్రాలు నదీజలాల విషయంలో ఉన్న విశేషాధికారాలు కోల్పోయినట్లుగా రెండు రాష్ట్రాల్లోనూ చర్చ జరిగింది. అయినప్పటికీ నేటికీ జల వివాదాలు పరిష్కారం కాకుండా అలాగే ఉండి పోయాయి.