పవన్ కల్యాణ్ కు అండగా ఉంటా.. కడప జిల్లాలో పర్యటిస్తా: వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్!
అమరావతి: అత్యంత ప్రమాదకరమైన యురేనియం నిక్షేపాలను వెలికి తీయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై కన్నేయడం పట్ల అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఇప్పటికే వామపక్ష పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి, పోరాటాలకు పిలుపు నిచ్చాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలను చేపట్టడానికి సమాయాత్తమౌతున్నారు. ఈ పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ ఓ అనూహ్య వ్యక్తి నుంచి మద్దతు లభించింది. పవన్ కల్యాణ్ చేసే పోరాటాలకు తాను అండగా ఉంటానని ప్రకటించారు. ఆయనే వాటర్ మ్యాన్ ఇండియాగా గుర్తింపు ఉన్న రాజేంద్ర సింగ్.
రాష్ట్రాన్ని శ్మశానంలా మార్చాలనుకున్నారా?: యురేనియంపై వామపక్షాలతో చేతులు కలిపిన టీడీపీ, కాంగ్రెస్
పవన్ కు అండగా..
కొద్దిరోజుల కిందట పవన్ కల్యాణ్ తో ఆయన భేటీ అయ్యారు. యురేనియం తవ్వకాలపై జనసేన నిర్వహించిన సదస్సుకు ఆయన హాజరయ్యారు. భవిష్యత్తులోనూ పవన్ కల్యాణ్ చేసే పోరాటాలకు, యురేనియం డ్రిల్లింగ్ ముప్పును ఎదుర్కొంటున్న గ్రామస్తులకు తాను మద్దతు ఇస్తానంటూ తాజాగా రాజేంద్ర సింగ్ ఓ వీడియో విడుదల చేశారు.
వీడియోను షేర్ చేసిన పవన్ కల్యాణ్
వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ మాట్లాడిన వీడియోను జనసేన పార్టీ, అధినేత పవన్ కల్యాణ్ సోమవారం ఉదయం విడుదల చేసింది. యురేనియం వల్ల పర్యావరణం ఏ స్థాయిలో ప్రమాదకర స్థితిని ఎదుర్కొంటుందనే విషయాన్ని ఎవరూ అంచనా వేయలేరని రాజేంద్ర సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.
దేశవ్యాప్త పోరాటం అవసరం
యురేనియం తవ్వకాలపై ఏ ఒక్క రాష్ట్రమో లేదా కొన్ని పార్టీలో పోరాటం చేయడం వల్ల అది సమసిపోయేది కాదని రాజేంద్ర సింగ్ అన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని, అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా పోరాటాన్ని కొనసాగించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. త్వరలో తాను కడప జిల్లాలో పర్యటిస్తానని రాజేంద్ర సింగ్ తెలిపారు. కడప జిల్లాలోని తుమ్మలపల్లి సమీపంలో యురేనియం తవ్వకాలకు కేంద్రం ఏర్పాట్లు పూర్తి చేసిందని అన్నారు. తవ్వకాలను నిర్వహించ తలపెట్టిన ప్రదేశలను పరిశీలిస్తానని చెప్పారు.
పవన్ ప్రశంసలు
యురేనియం మైనింగ్పై స్పందించిన వ్యాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా శ్రీ రాజేంద్రసింగ్కు హృదయపూర్వక అభినందనలు. కడపలో యురేనియం మైనింగ్కు, నల్లమల్ల అటవీ ప్రాంతానికి చెందిన బాధితులకు అండగా నిలవడం నిజంగా అభినందనీయం అని రాజేంద్ర సింగ్ వీడియోతోపాటు తన మెసేజ్ను పవన్ కల్యాణ్ షేర్ చేశారు.