సంచలనం:ఆంధ్రప్రదేశ్ లో ఇసుక మాఫియాపై పీఎంఓకు ఫిర్యాదు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాఫియాపై వాటర్మెన్ ఆఫ్ ఇండియా, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత డా.రాజేంద్ర సింగ్ సోమవారం ప్రధాని మంత్రి కార్యాలయం పీఎంఓకు ఫిర్యాు చేసినట్లు తెలిసింది. ఎపిలో అధికార పార్టీ నేతల అండతో ఇసుక మాఫియా రెచ్చిపోయి ప్రకృతి వనరులు కొల్లగొడుతోందంటూ ఆయన ప్రధాని కార్యాలయానికి లేఖ రాసినట్లు సమాచారం.
ఇంత భారీ ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతుండటంతో కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని...టీడీపీ నేతల అరాచకాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అటవీశాఖతో దర్యాప్తు చేయించాలి అని రాజేంద్ర సింగ్ ఆ లేఖలో విజ్ఞప్తి చేశారట.
కృష్ణ, గోదావరి పరివాహక ప్రాంతాల్లో యథేచ్ఛగా యంత్రాలతో ఇసుక తవ్వకాలను భారీఎత్తున చేపడుతున్నారని ఆయన తన లేఖలో వివరించినట్లు తెలిసింది. ఈ ఇసుక దోపిడీపై ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని, వాళ్లు ఎల్లప్పుడూ ఆయుధాలు కలిగివుంటున్నారని లేఖలో పేర్కొన్నారట. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏ మాత్రం ప్రయోజనం ఉండటం లేదని...అంతేకాకుండా ఇసుక మాఫియాతో అన్ని స్థాయిల అధికారులు కుమ్మక్కు అయ్యారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది.
మరోవైపు ఇప్పటికే ఎపి నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో సాగుతున్నఇసుక తవ్వకాలపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశించిన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విచ్చలవిడిగా కొనసాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను సవాల్ చేస్తూ "రేలా"అనే స్వచ్ఛంద సంస్థ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది.