ఐరన్ లెగ్ ఆంటీలంటే అసహ్యం: రోజాపై ఉమ, ఈ రోజు అబద్దంవద్దు: బొత్స
విజయవాడ: తమ పార్టీకి మహిళలు అంటే గౌరవమని, మహిళలే తమ పార్టీకి అండ అని, కానీ రోజా లాంటి ఐరన్ లెగ్ ఆంటీలు అంటే మాత్రం అసహ్యమని టిడిపి ఎమ్మెల్యే బోండ ఉమ సోమవారం అన్నారు. టిడిపి నేతలకు మహిళలంటే గౌరవం లేదన్న రోజా వ్యాఖ్యలపై ఉమ భగ్గుమన్నారు.
'ఇంతకుముందే రోజా ఏదో మాట్లాడారట.. టిడిపి సభ్యులకు మహిళల పట్ల గౌరవం లేదని చెప్పారట.. అసలు మహిళల పట్ల ఎవరికి గౌరవం లేదో రోజా ఆలోచించాలి. మేకప్పుతో రావొద్దని చెప్పిన జగన్కు గౌరవం లేదు' ఈ విషయం ఆలోచించాలని సూచించారు.
మహిళలంటే టిడిపికి అసహ్యం కాదని, మహిళలే తమకు అండదండా అన్నారు. ఐరన్ లెగ్ ఆంటీలు అంటే తమకు అసహ్యం అని రోజాను ఉద్దేశించి అన్నారు. ప్రజల కోసం పోరాడమని గెలిపిస్తే.. రోజా బూతుల రాణిగా, సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారన్నారు.
ఓ మహిళా ఎమ్మెల్యే సస్పెండ్ కావడం దాదాపు ఇదే మొదటిసారి అని, ఆ ఖ్యాతి మాత్రం రోజాకే దక్కిందన్నారు. ఇప్పటికైనా రోజా తన పద్ధతి, మాటతీరు మార్చుకోవాలన్నారు. లేదంటే ప్రజల్లో తిరిగే పరిస్థితి రోజాకు ఉండదని ధ్వజమెత్తారు. టిడిపికి మహిళలు అంటే ఎంత గౌరవమో... ఎన్టీఆర్ను చూస్తే తెలుస్తుందన్నారు.
రాజధాని బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్న వైసిపి నేతలు క్షమాపణలు చెప్పాలన్నారు. కాపు ఉద్యమానికి, ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఏమైనా సంబంధముందా అని బోండ ఉమ ప్రశ్నించారు. ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యల్లోని అంతరార్థమేమిటని ప్రశ్నించారు.
ఎమ్మెల్యేల అవిశ్వాసం సంపాదించు: పల్లె
భూదందా తమ సంస్కృతి కాదని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం పైన అవిశ్వాసం పెట్టడం కాదని, జగన్ మొదట తన ఎమ్మెల్యేల విశ్వాసాన్ని పొందారని ఎద్దేవా చేశారు.
రాజధానికి వ్యతిరేకం కాదు: బొత్స
రాజధాని అమరావతికి తాము వ్యతిరేకం కాదని వైసిపి నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. రాజధాని భూదందాలపై విచారణ జరిపిస్తారా లేదా చెప్పాలన్నారు. రాజధాని ప్రకటన రాకముందే టిడిపి నేతలు అక్కడ ఎలా కొన్నారో చెప్పాలని నిలదీశారు.
అసైన్డు భూములను ఎవరైనా కొనుక్కోవచ్చా? అని నిలదీశారు. రాగద్వేషాలకు అతీతంగా పని చేస్తామని ప్రమాణం చేసిన ప్రజాప్రతినిధులు అక్కడ భూములు ఎలా కొన్నారో చెప్పాలన్నారు. పెదబాబు సాంక్షన్లు చేస్తుంటే చినబాబు వసూళ్లు చేస్తున్నారని దుయ్యబట్టారు.
వేమూరి రవి కుమార్ ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. ఆయనకు ఐటీ విభాగంలో ప్రధాన పదవిని కట్టబెట్టారని, లోకేష్ సన్నిహితుడని తెలుసని, ఆయన పేరు మీదే భూములు కొన్నారన్నారు. అక్కడ భూములు కొంటే తప్పులేదని, కానీ అమెరికాలో ఉంటే వ్యక్తి ఎలా కొన్నాడో చెప్పాలన్నారు.
నారాయణ ఇంకో మాట చెబుతారని, ఆయన సంస్థలో పని చేస్తున్న ప్రమీళ అనే మహిళ అక్కడ 17 ఎకరాలు కొన్నారని, ఆయన బావమరిది సాంబశివ రావు కూడా కొన్నారని, వీటన్నింటికి సమాధానం చెప్పకుండా కొనుక్కుంటే తప్పేమిటంటే ఎలా అన్నారు.
పక్క ఊరే కావడం వల్ల దూలిపాళ్ల నరేంద్ర కొనుక్కున్నారని అనుకోవచ్చునని, అయితే 50 ఎకరాల అగ్రిమెంటు, 3 ఎకరాల రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, అవన్నీ పోరంబోకు భూములని వాటిని ఎలా రిజిస్ట్రేషన్ చేశారన్నారు. మరో మంత్రి పుల్లారావు ఇలాగే కొన్నా, దానికి సమాధానం లేదన్నారు. నేడు మహా శివరాత్రి పర్వదినం అని, తప్పు మాట్లాడితే ఆ పాపం వదలదన్నారు.