32ఏళ్ల క్రితం ఎన్టీఆర్ విషయంలో.. మళ్లీ ఇప్పుడు: క్షమాపణ చెప్పిన ప్రణయ్ రాయ్
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఊహించడంలో తాము పొరపాటు చేశామని, ప్రజలను కూడా అయోయమానికి గురిచేశామని అందుకు క్షమాపణ చెబుతున్నామని ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు ప్రణయ్ రాయ్ చెప్పారు. ప్రణయ్ రాయ్ 2 నిమిషాల 40 సెకన్ల నిడివి ఉన్న ఒక వీడియో సందేశం ద్వారా ఇది పొరపాటు ఎలా జరిగిందో వివరించారు.
ప్రణయ్ రాయ్ దాదాపు 30 ఏళ్ల నుంచి ఎన్నికల విశ్లేషణలో నిపుణుడిగా కొనసాగుతున్నారు. తమ సర్వే నిపుణులు బీహార్ ప్రజల నాడి పట్టడంలో విఫలమైనట్లు ఒప్పుకున్నారు. 32 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు క్లీన్ స్వీప్ చేస్తున్నారని ముందుగా ఊహించలేకపోయామని, ఆ తర్వాత తిరిగి ఇప్పుడు మాత్రమే తమ అంచనాలు తారుమారయ్యాయని ఆయన ఆ వీడియో సందేశంలో పేర్కొన్నారు.
దేశ ప్రజల్లో, ఎన్డీటీవీ ప్రేక్షకుల్లో తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అయోమయాన్ని పెంచాయని ఆయన అంగీకరించారు. కొన్నిసార్లు సాంకేతిక కారణాలతో ఇటువంటి తప్పులు జరుగుతాయని, మరోసారి ఇటువంటి పెద్ద తప్పులు జరుగకుండా చూసుకుంటామని తెలిపారు.
వివరాల్లోకి వెళితే... బీహార్లో ఐదో దశ పోలింగ్ ముగిసిన అనంతరం ప్రముఖ టీవీ చానళ్లు, సర్వే సంస్ధలు మహాకూటమి, బీజేపీకి మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని, నితీశే కాస్త ఆధిక్యత సాధిస్తారని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. ఆ మరుసటి రోజు ఎన్డీటీవీ మాత్రం బీహార్ ఎన్నికల్లో గెలుపు బీజేపీదేనని, 150కి పైగా సీట్లు సాధిస్తుందని ప్రకటించింది.
ఈ ఎగ్జిట్ పోల్స్ రిపోర్టును దేశ వ్యాప్తంగా అన్ని పత్రికలు, ప్రసార మాధ్యమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాయి. కాగా, ఆదివారం బీహార్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో ఎన్డీయే కూటమి కేవలం 58 స్థానాలు మాత్రమే సాధించగలిగింది.
ఎన్నికల బరిలో మొత్తం 3450 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మహా కూటమి 178 స్థానాల్లో విజయం సాధించింది. 14 జిల్లాల్లో బీజేపీ అసలు ఖాతానే తెరవలేదు. దీంతో ఎన్డీటీవీ అంచనాలు తలకిందులయ్యాయి.