బాబుకు ఝలక్, బీజేపీ కొత్త వ్యూహం: క్షేత్రస్థాయిలో లెక్క తీస్తున్నారు
అమరావతి: ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పాక్షిక తెగదెంపులు, రాజీనామాల అనంతరం బీజేపీ, టీడీపీలు మాటల యుద్ధంతో పాటు మరో కార్యాచరణలోకి కూడా దిగాయి. ఏపీకి కేంద్రం సహకరించడం లేదన్న టీడీపీ నేతలకు బీజేపీ గట్టిగా జవాబిచ్చేందుకు క్షేత్రస్థాయిలోకి రంగంలోకి దిగింది.
Recommended Video
హోదాపై సంతకం పెడితే మద్దతు, 25 మందిని ఇవ్వండి: కాంగ్రెస్-బీజేపీలకు జగన్ ఆఫర్
చంద్రబాబు కేబినెట్లో ఉన్న బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, మాణిక్యాల రావులు గురువారం మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఆ వెంటనే బీజేపీ రంగంలోకి దిగింది. కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది, ఏపీ ఎంత ఖర్చు పెట్టింది అనే అంశాలపై లెక్కలు తీసేందుకు సిద్ధమయ్యారు.
ఎయిమ్స్ను పరిశీలించిన బీజేపీ నేతలు
ఇందులో భాగంగా బీజేపీ నేతలు గుంటూరులోని ఎయిమ్స్ పనులను పరిశీలించారు. కామినేని శ్రీనివాస్ రావు తదితర బీజేపీ నేతలు నిర్మాణ పనులను పరిశీలించారు. లెక్కలపై ఆరా తీశారు. వారు ఇతర కేంద్ర పథకాలు, ప్రాజెక్టుల అమలు తీరును కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.
2020 నాటికి వైద్యసేవలు అందుబాటులోకి
ఈ సందర్భంగా బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడారు. 2020 నాటికి ఎయిమ్స్ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఏపీ అభివృద్ధిపై బీజేపీకి చిత్తశుద్ధి ఉందని చెప్పారు. రూ.189 కోట్లతో ఎన్ఐటీ పనులు జరుగుతున్నాయన్నారు. ఇవన్నీ ప్రజలకు తెలియాలన్నారు.
చంద్రబాబు మాటలు దౌర్భాగ్యం
ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీకి కేంద్రం సాయం చేయలేదని చెప్పడం విడ్డూరమని బీజేపీ నేతలు అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. కాగా, కేంద్రం ప్రాజెక్టులు, పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎంత మేరకు నిధులు వచ్చాయి, ఎంత మేర ఖర్యయ్యాయో బీజేపీ నేతలు తెలుసుకోనున్నారు.
అశోక్ గజపతి రాజు ఇలా
ఇదిలా ఉండగా, టీడీపీ కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలు ఇంకా రాజీనామాలు సమర్పించలేదు.
అశోక్ మాట్లాడుతూ... ఇంకా తమకు ప్రధాని అపాయింటుమెంట్ దొరకలేదన్నారు. తమ నాయకుడు చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటామన్నారు. జాతీయ పార్టీలు అప్పుడు విభజన చేశాయని, ఇప్పుడు ఆదుకోవాల్సి ఉందన్నారు. కేంద్రం సహకరిస్తే ఏపీ నిలదొక్కుకుంటుందని చెప్పారు. విభజన చట్టాన్ని అమలు చేయాల్సిందే అన్నారు.
మోడీ కోసం వేచి చూస్తున్నాం
తాము ప్రధాని నరేంద్ర మోడీ కోసం వేచి చూస్తున్నామని అశోక్ అన్నారు. తాము ప్రధానితో చర్చల కోసం వేచి చూడటం లేదని, రాజీనామాలు సమర్పించేందుకు అన్నారు. అలాగే కేబినెట్లో తమకు ఇన్నాళ్లు అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు చెబుతామన్నారు.