ఏపీ పెంచుకుంటే అడ్డుపడం, కానీ: తెరాస ఎంపీ వినోద్, కేసీఆర్కు కితాబు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఎమ్మెల్సీల సంఖ్యను 50 నుండి 58కు పెంచుకునేందుకు తాము వ్యతిరేకం కాదని తెరాస ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. లోకసభలో పునర్విభజన బిల్లు చట్ట సవరణ నేపథ్యంలో వినోద్ కుమార్ మాట్లాడారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపారని, ఈ రోజుకు కూడా ఆ మండలాల ప్రజలు ఎలా జీవిస్తున్నారో తెలియని పరిస్థితిలో ఉన్నారన్నారు. రాజ్యాంగస్ఫూర్తికి వ్యతిరంగా ఏడు మండలాలను ఏపీలో కలిపారన్నారు.
ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి విద్యుత్ ఇస్తేనే ముంపు ప్రాంతాల మండలాలకు వెలుగు వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ రాజకీయ లబ్ధి కోసమే, ఎమ్మెల్యేలు, ఎంపీలు కావడం కోసమో జరగలేదన్నారు.
1995-96 ప్రాంతాల్లో నక్సలైట్ల పేరుతో యువతను చంపేశారని, పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారన్నారు. అలాంటి సమయంలో తెలంగాణలో ఇన్ని కష్టాలు ఎందుకని ఆలోచించామన్నారు. ఆ తర్వాత చాలాకాలం మేథావులు చర్చించి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే సమస్యలు పరిష్కారమవుతాయని నిర్ణయించారని, ఆ తర్వాత తెరాస పార్టీ పుట్టుకు వచ్చిందన్నారు.
కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెరాసను స్థాపించి శాంతియుతంగా 14 ఏళ్ల పాటు ఉద్యమాన్ని నడిపారన్నారు. తెలంగాణ సాధించారన్నారు. తమ నాయకుడు నెత్తురు చుక్క కారకుండా రాష్ట్రం సాధించారన్నారు. ఏపీ విభజన చట్టం పాసై ఏడాది కాకుండానే రెండు సవరణలు చేశారన్నారు. తెలంగాణ ఏర్పడిన తొలి రోజే ఏడు మండలాలను ఏపీలో కలిపారన్నారు. హైదరాబాదులో ఉన్న హైకోర్టు తెలంగాణకే చెందుతుందని చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందన్నారు. హైకోర్టు విభజనకు తాము పలుమార్లు కేంద్రాన్ని కలిశామన్నారు. ఇరు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించాలని కేంద్రాన్ని కోరారు. ఏపీలో 119 నుండి 153 వరకు అసెంబ్లీ స్థానాలు పెంచుకునే అవకాశముందన్నారు. ఏపీకి శాసన మండలి సభ్యుల పెంపుకు తాము వ్యతిరేకం కాదని, కానీ ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించాలన్నారు.