సినీ గ్లామర్ను నమ్ముకోలేదు: మహేష్పై గల్లా అరుణ
హైదరాబాద్: తాము ఇన్నాళ్లు సొంత ఇమేజ్తో రాజకీయం చేశామని, సినీ గ్లామర్ను నమ్ముకోలేదని మాజీ మంత్రి, శనివారం తెలుగదేశం పార్టీలో చేరిన చిత్తూరు జిల్లా సీనియర్ నాయకురాలు గల్లా అరుణ కుమారి అన్నారు. కృష్ణ, మహేష్ బాబులతో తమకు బంధుత్వం ఉన్నంత మాత్రాన వారిపై తాము ఒత్తిడి తేదల్చుకోలేదన్నారు.
ఏడున్నర దశాబ్దాలుగా తాము సొంత ఇమేజ్తో రాజకీయం చేశామన్నారు. తమకు కేడర్ కూడా సహకరిస్తుందని చెప్పారు. తాము కాంగ్రెసు పార్టీని వదల్లేదని, పార్టీయే తమను వదిలేసిందన్నారు. కాంగ్రెస్ తమను రోడ్డున పడేసిందన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పెట్టబోయే పార్టీపై మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు. కిరణ్ పార్టీలో ఏముందో, ఏం లేదో తెలియదని, అలాంటి కిరణ్ పార్టీ గురించి తాను ఎలా మాట్లాడుతానని ఆమె చెప్పారు. మరోవైపు తనకు తన బంధువు ప్రిన్స్ మహేష్ బాబు మద్దతు ఉంటుందని గల్లా జయదేవ్ చెప్పారు.
కిరణ్ పార్టీకి మద్దతివ్వండి: హర్ష కుమార్
కాంగ్రెస్ పార్టీ తమను అవమానపరచిందని మాజీ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు హర్ష కుమార్ మండిపడ్డారు. పదేళ్లపాటు పార్టీ ఉన్నతికి పాటుపడినప్పటికీ తమకు విలువ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కిరణ్ పెడుతున్న పార్టీకి మహిళలు, యువత మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ నెల 12న రాజమండ్రిలో జరగబోయే సభకు అభిమానులు భారీ ఎత్తున తరలి రావాలని కోరారు.
కాపుపై కేసు
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డిపై కేసు నమోదు చేసినట్టు అనంతపురం ఎస్పీ తెలిపారు. కౌన్సిలింగ్ పేరుతో తాము ఎవరినీ వేధించలేదని ఎస్పీ శనివారం చెప్పారు. వాహనాల తనిఖీలు, సోదాల్లో భాగంగా ఇప్పటివరకు రూ.2 కోట్ల 78 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, కాపు ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగవుతోంది.