వాళ్లు ఐదుగురు చెబితే సరిపోతుందా? నేను బాబు హోదా ఉద్యమానికి మద్దతివ్వను: పోసాని షాక్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై గతంలో మండిపడిన ప్రముఖ నటుడు, మాటల రచయిత పోసాని మురళీ కృష్ణ మరోసారి విమర్శలు గుప్పించారు. అంతేకాదు, చంద్రబాబు వద్దకు వెళ్లి కొందరు వెళ్లి మద్దతిస్తే సినిమా పరిశ్రమ మొత్తం ఇచ్చినట్లు కాదని అభిప్రాయపడ్డారు.
చదవండి: అగ్రిగోల్డ్ షాక్.. విజయసాయి వల్లే వెనక్కి తగ్గిన జీగ్రూప్
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబుకు మద్దతిస్తున్నామని తెలుగు సినీ పరిశ్రమ నుంచి వెళ్లిన నలుగురైదుగురు చెబితే సరిపోతుందా అని ప్రశ్నించారు. మొత్తం సినీ పరిశ్రమ తరఫున చంద్రబాబుకు మద్దతివ్వడానికి వీళ్లు ఎవరని నిలదీశారు.
చదవండి: చంద్రబాబు వెంటే మేం, టీడీపీ కోసం నేను-జూ.ఎన్టీఆర్ సిద్ధం: కళ్యాణ్ రామ్
చంద్రబాబును కలిసిన సినీ ప్రముఖులు
కొద్ది రోజుల క్రితం సినీ ప్రముఖులు అశ్వనీదత్, కే రాఘవేంద్ర రావు, వెంకటేశ్వర రావు, కిరణ్లు అమరావతిలో చంద్రబాబును కలిశారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. సినీ పరిశ్రమ మద్దతు మీకు ఉంటుందన్నారు. దీనిపై పోసాని నిప్పులు చెరిగారు.
ఓ పత్రిక రాసింది.. ఖండించండి
సదరు నలుగురైదుగురు సినీ ప్రముఖులు చంద్రబాబును కలిసి సినీ ఇండస్ట్రీ నుంచి సంపూర్ణ మద్దతు ఉందంటూ ప్రకటన చేశారని, ఈ విషయం పత్రికలో వచ్చిందని పోసాని అన్నారు. ఒకవేళ ఆ పత్రిక అబద్ధం రాసి ఉంటే ఆ వార్తను వీళ్లు ఖండించాలని డిమాండ్ చేశారు. సినీ పరిశ్రమ తరపున కాకుండా వ్యక్తిగతంగా చంద్రబాబును కలిసి తమ మద్దతు ప్రకటించామని చెప్పాలన్నారు.
నేను చంద్రబాబు హోదా ఉద్యమానికి మద్దతివ్వట్లేదు
సినీ పరిశ్రమ మొత్తం చంద్రబాబు ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతుగా ఉంటుందని వారు చెప్పారని, కానీ నేను మాత్రం మద్దతు ఇవ్వడం లేదని పోసాని కుండబద్దలు కొట్టారు. తమను అడగకుండా మొత్తం సినీ పరిశ్రమ తరపున ఎలా మద్దతు ఇస్తారని, ఇండస్ట్రీ అంటే ఆ అయిదుగురేనా అని గట్టిగా నిలదీశారు.
గతంలో చంద్రబాబుపై ఆగ్రహం
గతంలో ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పోసాని మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబును తప్పుబట్టారు. హోదా విషయంలో ఆయన ఎన్నోసార్లు మాట మార్చారని ఆరోపించారు. నాలుగేళ్ల క్రితమే బీజేపీ హోదా ఇవ్వమని స్పష్టంగా చెప్పిందని, ఆ తర్వాత చంద్రబాబు హోదా వద్దు.. ప్యాకేజీ బెట్టర్ అన్నారని, ఇప్పుడు మళ్లీ హోదా ఎత్తుకున్నారన్నారు.