పవన్ మాతో కలిసి పని చేస్తారా లేదా ఆలోచించట్లేదు, మేం తప్ప ఎవరూ లేరు: కాల్వ
అమరావతి: తాము ఎవరితో కూడా పొత్తు కోసం వెంపర్లాడటం లేదని మంత్రి కాల్వ శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ మాతో కలిసి మళ్లీ పని చేస్తారా లేదా అని తాము ఆలోచించడం లేదని వ్యాఖ్యానించారు.
లెక్కలుతీస్తున్న చంద్రబాబు, జగన్ ధీమా: పవన్ కళ్యాణ్కు అదే మైనస్!
పొత్తు లేకున్నా గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే మాకు బలమైన ఓటు బ్యాంకు అన్నారు. తెలుగుదేశం పార్టీని కాదని వేరేవారికి ఓటు వేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదన్నారు. సోషల్ మీడియాలో విచ్చలవిడితనం కంట్రోల్ చేయాల్సి ఉందని చెప్పారు.
జగన్పై దేవినేని ఆగ్రహం
ఏపీలో జరుగుతున్న నీటి పారుదల ప్రాజెక్టులపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్కసు వెళ్లగక్కుతున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మండిపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాసుల కక్కుర్తితో జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చేశారన్నారు. ఈ విషయం జగన్కు తెలియదా అన్నారు.
జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు ఎందుకు వెళ్తున్నారో ఆయనకు చెందిన రూ.40వేల కోట్లకు పైగా ఆస్తులను ఈడీ ఎందుకు జప్తు చేసిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. తమ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవడమే జగన్ పనిగా పెట్టుకున్నారన్నారు.
Recommended Video
పట్టిసీమ ద్వారా గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కు ఈ నాలుగేళ్లలో 187 టీఎంసీల నీరు మళ్లించిన విషయం జగన్కు కనబడటం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టును ఆపేందుకు ప్రయత్నిస్తున్న జగన్ చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని విమర్శించారు.