టీడీపీని బుజ్జగించడం లేదు: హరిబాబు, 'జగన్కు మోడీని నిలదీసే దమ్ముందా'
విశాఖపట్నం: కేంద్రం నుంచి టీడీపీ బయటకు రావడం, చంద్రబాబు కేబినెట్ నుంచి బీజేపీ మంత్రులు బయటకు వచ్చిన నేపథ్యంలో బీజేపీ ఏపీ అధ్యక్షులు హరిబాబు స్పందించారు. ప్రత్యేక హోదా వస్తేనే రాయితీలు వస్తాయన్న టీడీపీ, వైసీపీ నేతల వ్యాఖ్యలను కొట్టి పారేశారు.
ప్రత్యేక హోదాకు, రాయితీలకు సంబంధం లేదన్నారు. బీజేపీ సాయం చేయలేదని టీడీపీ చెప్పడం బాధాకరమన్నారు. మూడున్నరేళ్లలో ఏపీకి చేసినంత సాయం మరెవరికీ చేయలేదన్నారు. కేంద్రమంత్రి జైట్లీ మాటలకు విపరీతార్థాలు తీయవద్దన్నారు.
హోదాపై సంతకం పెడితే మద్దతు, 25 మందిని ఇవ్వండి: కాంగ్రెస్-బీజేపీలకు జగన్ ఆఫర్
టీడీపీతో తాము బుజ్జగింపు చర్చలు జరపడం లేదని తేల్చి చెప్పారు. రాజీనామాలపై టీడీపీ వెనక్కి పోదు అనుకుంటున్నానని చెప్పారు. టీడీపీ కేంద్రమంత్రులు రాజీనామా చేయకముందు ఆయన ఈ వ్యాఖ్యలు చెప్పారు.
ప్రత్యేక హోదా లేదన్న బీజేపీపై టిడిపి నేత, ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని ప్రధాని పాలిస్తున్నారా లేక 14వ ఆర్థిక సంఘమా అని నిలదీశారు. వైసీపీ అధినేత జగన్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారా లేక శకుని పాత్ర పోషిస్తున్నారా అని మండిపడ్డారు. మోడీని నిలదీసే దమ్ము జగన్కు ఉందా అని సవాల్ చేశారు.