మీ త్యాగాన్ని చూసి గర్వపడుతున్నాం .. పోలీసు కుటుంబాలకు ఏపీ డీజీపీ లేఖ
కరోనా వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను టెన్షన్ పెడుతుంది . కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ ప్రకటించాయి కేంద్ర రాష్ట్ర ప్రభుతాలు . ఇక ఈ నేపధ్యంలో ప్రజలు బయటకు రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రజల ఆరోగ్య రక్షణకు పోలీసులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు . కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో లాక్డౌన్ను సమర్ధవంతంగా పాటిస్తున్న నేపధ్యంలో ఏపీ డీజీపీ పోలీసులను అభినందించారు. ఈ లాక్డౌన్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు పోలీసులని , ప్రజలెవరు బయటకు రాకుండా వారు రక్షణ కల్పిస్తున్నారని పేర్కొన్నారు. కఠిన చర్యలు తీసుకుంటున్నా అది ప్రజల క్షేమం కోసమే అని ఆయన అన్నారు.
కరోనా కట్టడిలో లాక్ డౌన్ ను ప్రశాంతంగా కొనసాగేలా చేస్తున్న ఏపీ పోలీసులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ బహిరంగ లేఖ రాశారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో నిరంతర సేవలు అందిస్తోన్న పోలీసులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మీరు చేస్తున్న సేవలు ఆపారమైనవని కొనియాడారు. అంతే కాదు రక్షక భటుడు అనే పేరుకు సార్ధకత జరుగుతోందని దీజేపీ వ్యాఖ్యానించారు . నిజంగా మీరు ప్రజా రక్షక భటులు అని ఆయన ప్రజలకు సేవ చేస్తున్న తీరును మెచ్చుకున్నారు.
ప్రజా ప్రాణ రక్షణే కర్తవ్యంగా భావించి కరోనా మహమ్మారికి ఎదురొడ్డి సేవలందిస్తున్న మిమ్మల్ని చూసి గర్వపడుతున్నానని పేర్కొన్నారు డీజీపీ గౌతమ్ సవాంగ్ . కరోనా కట్టడికి విధులు నిర్వహిస్తున్న పోలీసులకి, వారికి అండగా నిలుస్తున్న కుటుంబాలకు ప్రత్యేక అభినందనలు తెలియజేసిన ఆయన పోలీస్ కుటుంబాలు పరోక్షంగా చేస్తున్న త్యాగాలు మరువలేనివని పోలీసుల కుటుంబాలను కొనియాడారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టే క్రమంలో ఇంకా చాలా పని ఉందని అందరూ కరోనా మహమ్మారిని అంతం చేసే దాకా విశ్రాంతి తీసుకోరాదని చెప్పారు. అతి త్వరలో ఈ వైరస్ను తరిమి కొడతామని పోలీసుల తరఫున రాష్ట్ర ప్రజానీకానికి నేను మాట ఇస్తున్నా అని సవాంగ్ పోలీసులకు, పోలీసుల కుటుంబాలకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.