ఉప ఎన్నికలకు మేము సిద్ధం:వైసిపి ఎంపి వైవీ సుబ్బారెడ్డి
ఒంగోలు:ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండ్ తో తమ పదవులకు రాజీనామాలు సమర్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలకు లోక్ సభ స్పీకర్ నుంచి పిలుపు అందిన సంగతి తెలిసిందే.
మే 29 న తనను కలవాలంటూ స్పీకర్ నుంచి నోటీసులు అందిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రం లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కలువనున్నట్టు వైసిపి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాకుతెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ ఎంపీలు స్పీకర్ ను కలిసి రాజీనామాలు ఆమోదించండి లేదా ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడగనున్నామన్నారు.
అది తప్ప తమ నుంచి మరో మాట ఉండదని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తాము రాజీనామాలు చేసి ఇన్ని రోజులవుతున్నా వాటిని ఆమోదించకపోవడం రాష్ట్ర ప్రజలను అవమానించడమేనన్నారు. ఉప ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఉప ఎన్నికలే కాకుండా సార్వత్రిక ఎన్నికల్లోనూ వైసిపి గెలిపించడానికి రాష్ట్ర ప్రజలు మానసింగా సిద్ధమయ్యారని చెప్పారు.
ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టులో చంద్రబాబు కోట్లాది రూపాయలు కమిషన్ రూపంలో దండుకున్నారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. వెలిగొండ ప్రాజక్ట్ ను డిసెంబర్ నాటికల్లా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం హాస్యాస్పదమని వైవీ సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు.