'బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలి': 4 గోడలు కడితే రాజధానా: అశోక్ బాబు షాక్
విజయవాడ/చిత్తూరు: అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మేల్యే, నటుడు బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని సీనియర్ నటి జయంతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శనివారం నాడు కోరారు. హిందూపురం నియోజకవర్గ అభివృద్ధికి బాలయ్య అహర్నిశలూ పాటుపడుతున్నారన్నారు.
బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. హిందూపురంలో జరుగుతున్న లేపాక్షి ఉత్సవాల్లో భాగంగా జయంతిని బాలకృష్ణ, చంద్రబాబులు సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తనను గుర్తు పెట్టుకుని బెంగళూరు నుంచి పిలిపించిన బాలకృష్ణను ఆమె అభినందించారు.
ఎంతో శ్రమ తీసుకుని బాలకృష్ణ ఈ కార్యక్రమాన్ని తలపెట్టారన్నారు. బాలయ్యను మంత్రిగా చేయాలని, అందుకు చంద్రబాబు ఆశీర్వాదం ఉండాలన్నారు.
నాలుగు గోడలు కడితే సరిపోదు: అశోక్ బాబు
జూన్ నెలలోపు తాత్కాలిక రాజధాునిని నిర్మిస్తామని ప్రభుత్వం చెబుతోందని, రాజధాని కడితే వెళ్లడానికి తాము ప్రయత్నిస్తామని, అయితే నాలుగు గోడలు కడితే రాజధాని అయిపోదని ఏపీఎన్జీవో నేత అశోక్ బాబు శనివారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్ని వసతులు కల్పిస్తే అమరావతి వెళ్లేందుకు సిద్ధమని తాము మొదటి నుంచి చెబుతున్నామన్నారు.