కేంద్రంపై విజయసాయి రెడ్డి ఫైర్: జగన్ చెప్తే రాజీనామా, కానీ మెలిక, విశాఖలో నిరసన
న్యూఢిల్లీ: ఏపీకి ఆశించిన కేటాయింపులు లేకపోవడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయ సాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖ రైల్వే జోన్ మొదలు అన్నింటా కేంద్రం ఏపీకి మొండి చేయి చూపిందని విమర్శించారు.
Recommended Video
రైల్వే జోన్ లాభదాయం కాదని విశాఖ విషయంలో మొండిచేయి చూపారని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. దీనిని బట్టి చూస్తుంటే దేశ ఆర్థిక బడ్జెట్ బాగా లేదని అర్థమవుతోందని విమర్శించారు. ప్రాఫిటబుల్ కాదని పక్కన పెట్టడం విడ్డూరమన్నారు.
మేం లేకుంటే ఎవరు అడుగుతారు
ఏపీకి ప్రత్యేక హోదా దక్కలేదని, ప్యాకేజీ ఆశించినట్లుగా లేదని మరి వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేస్తారా అని విలేకరులు ప్రశ్నించారు. దీనిపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తమ అధినేత జగన్ ఎప్పుడు రాజీనామా చేయమంటే చేస్తామని చెప్పారు. కానీ మేం లేకుంటే కేంద్రాన్ని అడిగేవారు ఎవరని ప్రశ్నించారు.
రాజీనామాలపై ఇలా మెలిక
ఏపీకి ఆశించిన మేర రాకపోడవంలో టీడీపీ వైఫల్యం ఉందని వైసీపీ ఎంపీలు అభిప్రాయపడ్డారు. తాము రాజీనామాలకు సిద్ధమని, కానీ తామే రాజీనామా చేస్తే ఏపీ గురించి ఎవరు అడుగుతారని మెలిక పెట్టడం గమనార్హం. కేంద్ర బడ్జెట్ పూర్తిగా నిరాశ పరిచిందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
ఎన్నో ఆశలు
కాగా, తెలుగు రాష్ట్రాలు బడ్జెట్ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. కానీ నిరాశ ఎదురైంది. జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో అమరావతి, పోలవరం నిధుల ప్రస్తావన లేదు. అయితే ఏపీకి ఏ మేరకు ఇచ్చారని బడ్జెట్ ప్రతులు పూర్తిగా చదివితే తెలుస్తుంది.
వైసీపీ నిరసన
బడ్జెట్లో ఏపీకి మొండి చెయ్యి చూపించారని, రైల్వే బడ్జెట్లో అన్యాయం చేశారంటూ వైసీపీ శ్రేణులు విశాఖలోని ఆశీల్మెట్ జంక్షన్లో నిరసన తెలుపుతూ బైఠాయించారు. వేతన జీవులకు ఎటువంటి ఊరట కల్పించలేదన్నారు. బడ్జెట్లో విశాఖ రైల్వే జోన్ ఊసెత్తకుండా ఏపీ ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిన జైట్లీ పలు విద్యాలయాలకు నిధులు కేటాయించి కొంత ఊరటనిచ్చారు. ఏపీ పంపిన అనేక ప్రతిపాదనలు బడ్జెట్లో పక్కనపెట్టారు. ఏపీకి సంబంధించి మెగా ప్రాజెక్టుల గురించి ప్రస్తావించలేదు. అమరావతి నిర్మాణానికి సంబంధించి, ఏపీకి రావాల్సిన విభజన రావాల్సిన హక్కులు, హామీలపై ఎలాంటి కేటాయింపులు జరుగలేదు. అయితే ఏపీలోని పలు విశ్వవిద్యాలయాలతో పాటు విశాఖ పోర్టుకు నిధులు కేటాయించినట్లు జైట్లీ ప్రకటించారు.