'స్వీటు తిని తిట్టుకున్న బాబు, కేసీఆర్', కోర్టుకని నాగం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ఏపీసీసీ చీఫ్ అధ్యక్షులు రఘువీరా రెడ్డి శుక్రవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు, కేసీఆర్లు లోపల మిఠాయులు తింటూ బయటకు వచ్చి ఇరువురు తిట్టుకుంటూ ప్రజలను పిచ్చివాళ్లను చేస్తున్నారని ధ్వజమెత్తారు.
విద్యుత్ సంక్షోభానికి అరవయ్యేళ్ల కాంగ్రెస్ పార్టీయే కారణమన్న మంత్రి కేటీఆర్తో తాము చర్చకు సిద్ధమని ప్రకటించారు. ప్రభుత్వం అడిగే ప్రశ్నలు సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కాంగ్రెస్సే విద్యుత్ కోతకు కారణమన్న కేసీఆర్ మేనిఫెస్టోలో ఎనిమిది గంటల విద్యుత్ ఇస్తానని ఎందుకు చెప్పారన్నారు.
తాము ఇప్పుడు భరోసా యాత్ర చేస్తున్నందున కేసీఆర్ మేల్కొని, ఢిల్లీ పరుగెత్తారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో తప్పుడు వాగ్ధానాలు చేసిన కేసీఆర్ తెలంగాణ ప్రజలకు వెంటనే క్షణాపణలు చెప్పాలన్నారు.
లోకేష్ పైన బాల్క సుమన్
టీడీపీ యువనేత నారా లోకష్కు కేసీఆర్ పైన మాట్లాడే స్థాయి లేదని తెరాస ఎంపీ బాల్క సుమన్ అన్నారు. ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని, చంద్రబాబు తన వాగ్ధానాలను నిలబెట్టుకుంటారా అని ప్రశ్నించారు. పంటర రుణమాఫీకి తొలి విడతగా తమ ప్రభుత్వం రూ.4,250 కోట్లు విడుదల చేసిందని, ఏపీలో చంద్రబాబు ఒక్క పైసా విడుదల చేయలేదని, దీనిపై లోకేష్ ఎందుకు మాట్లాడటం లేదన్నారు.
త్వరలో తెరాసలోకి: ధర్మారెడ్డి
తాను త్వరలో తెరాసలో చేరనున్నట్లు వరంగల్ జిల్లా టీడీపీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి చెప్పారు. కార్యకర్తల మనోభావాలు, నియోజకవర్గ అభివృద్ధి దృష్ట్యా తాను తెరాసలో చేరనున్నట్లు చెప్పారు.
కోర్టుకెళ్తా: నాగం
పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన సభాపతి అనర్హత వేటు వేయాలని బీజేపీ తెలంగాణ నేత నాగం జనార్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. సభాపతి పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన వేటు వేయకుంటే తాను కోర్టుకు వెళ్తానని హెచ్చరించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని ధ్వజమెత్తారు. తనతో పాటు ఎనిమిది మంది టీడీపీ ఎమ్మెల్యేలు తెరాసలోకి వస్తారని ధర్మారెడ్డి చెప్పారు.
చంద్రబాబుపై రఘువీరా రెడ్డి
రాజధాని కోసం రైతులను బెదిరించే అంత పుడుంగులా అని చంద్రబాబును ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ప్రశ్నించారు. రాజధానికి లక్ష ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ భూముల్లోనే రాజధానిని నిర్మించాలన్నారు. రైతులను చంద్రబాబు బెదిరించలేరు.. జాగ్రత్త అంటూ హెచ్చరించారు.
రోజు చంద్రబాబే: మోత్కుపల్లి
చంద్రబాబును రోజూ విమర్శించడం కాదని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ఎంత ముందుచూపుతో విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారో కేసీఆర్ చూసి నేర్చుకోవాలని తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు వేరుగా పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో జరుగుతున్న బస్సు యాత్రలో ఆయన మాట్లాడారు. 220 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఉలుకూపలుకూ లేకుండా ఉందన్నారు.
విద్యుత్ కొరత ఉందని తెలిసినా కేసీఆర్ ఎలాంటి చర్యలూ చేపట్టలేదన్నారు. తెరాసది పండుగల ప్రభుత్వమా? ప్రజా ప్రభుత్వమా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఎటుచూసినా సమస్యలు తాండవిస్తున్నాయన్నారు. కేసీఆర్కు మాత్రం పండుగ సందడి కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేవరకు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామన్నారు.