ప్రత్యేకహోదాపై బాబుతో మాట్లాడాం, త్వరలోనే: అమిత్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా మంగళవారం నాడు స్పందించారు. ప్రత్యేక హోదా పైన వెనక్కి వెళ్లే సమస్య లేదన్నారు.
ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తాము మాట్లాడామన్నారు. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీవీతో కేంద్రమంత్రి వెంకయ్య మంగళవారం మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. తాము ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చుతామని చెప్పారు. ప్రత్యేక హోదా హామీని తప్పకుండా నెరవేరుస్తామన్నారు.
తాము తెస్తున్న భూసేకరణ చట్టం సమగ్రమైందన్నారు. ఏడాది పాలనలో రాజకీయ అవినీతిని అడ్డుకోగలిగామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారులు జైలుకు వెళ్లారన్నారు. ప్రయివేటు వ్యక్తులకు వేలాది ఎకరాల భూములు కట్టబెట్టారన్నారు.
తాము ఒక్క సెంటు భూమిని కూడా ప్రయివేటు వ్యక్తులకు ధారాదత్తం చేయమన్నారు. తాము వచ్చాక అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్ కేంద్రంగా మారిందన్నారు. తాము రాజకీయ అవినీతిని అడ్డుకోగలిగామని చెప్పారు.