స్వాగతిస్తున్నాం: రేణుకా చౌదరి, కోర్టుకెళ్తాం: జగన్
హైదరాబాద్: సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేసిన సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల రాజీనామాలను లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించడాన్ని స్వాగతిస్తున్నట్లు రాజ్యసభ సభ్యురాలు, ఏఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి తెలిపారు. సీమాంధ్రుల సమస్యలను తెలుసుకునేందుకు కేంద్రమంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె శుక్రవారం అన్నారు. పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని రేణుకా చౌదరి అన్నారు.
రాజీనామాల తిరస్కరణపై కోర్టును ఆశ్రయిస్తాం
పార్లమెంటు సభ్యుల రాజీనామాలను లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. సమైక్యాంధ్రకు మద్దతుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితోపాటు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎస్సివై రెడ్డి స్పీకర్ ఫార్మాట్ రాజీనామా చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. తమ పార్టీ ఎంపీల రాజీనామాలను ఆమోదింపచేసుకునే దిశగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వైయస్సార్సిపి తెలిపింది.
రాహుల్ని ప్రధానిని చేసేందుకే విభజన
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజన చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి మారెప్ప ఆరోపించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి పూనుకున్నారని ఆయన మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రాన్ని విభజించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని ప్రయత్నాలు చేస్తుంటే.. అందుకు తెలుగుదేశం పార్టీ వత్తాసు పలుకుతోందని మార్పెప్ప విమర్శించారు.