ఇంట్లో ఎలుకల్నే కంట్రోల్ చేయలేకపోతున్నాం: మంత్రి కామినేని వ్యాఖ్య
హైదరాబాద్: మనం ఇంట్లోనే ఎలుకలు, బొద్దింకలను కంట్రోల్ చేయలేకపోతున్నామని, అలాంటిది ఆసుపత్రిలో ఎలుకలను అదుపు చేయడం ఒకింత కష్టమేనని ఆంధ్రప్రదేశ్ మంత్రి కామినేని శ్రీనివాస్ రావు బుధవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గుంటూరు జిజిహెచ్లో జరిగిన ఎలుకల ఘటనను రాష్ట్రం అంతటికీ ఆపాదించవద్దని కామినేని చెప్పారు. బుధవారం ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొని ఈసీజీని అర్థం చేసుకోవడం ఎలా? అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడారు.
ఆసుపత్రిలో ఎలుకలను అదుపు చేయడం మానవసాధ్యం కాదన్నారు. ఆసుపత్రుల్లో ఎలుకలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మన ఇళ్లల్లో ఉన్న ఎలుకలు, బొద్దింకలనే అదుపు చేయలేకపోతున్నామని, ఇక ఆసుపత్రులలో వాటిని అదుపు చేయడమనేది ఎంతో కష్టంతో కూడుకున్నదన్నారు.
ఆసుపత్రులలో ఎలుకలు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ రోజు నుంచి 8 జిల్లాల్లో రెండో విడత ఇంద్రధనస్సు కార్యక్రమాన్ని చేపడతామని ఆయన తెలిపారు. దీని ద్వారా చిన్నపిల్లలకు ఏడు రకాల వ్యాధులు రాకుండా వ్యాక్సిన్ ఇస్తున్నామన్నారు.
రాజకీయ మనుగడ కోసమే: పత్తిపాటి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ రాజకీయ మనుగడ కోసమే దీక్ష చేపడుతున్నారని మంత్రి పత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఏపీలో ఇప్పటి వరకు 160 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. 45మంది వ్యవసాయంలో నష్టంతో చేసుకున్నారన్నారు. త్వరలో ఆత్మహత్యలకు పరిష్కారం కనుగొంటామన్నారు.