హిందువులను నరికి పారేయండి: సాదినేని యామిని: ఏపీలో మరో రెండు విగ్రహాలు ధ్వంసం
అమరావతి: రాష్ట్రంలో దేవతా మూర్తులు, విగ్రహాల విధ్వంసం కొనసాగుతున్నట్లుగా కనిపిస్తోంది. విజయనగరం జిల్లా రామతీర్థంలో చోటు చేసుకున్న ఉదంతాన్ని విస్మరించకముందే.. ఈ ఘటన వల్ల చెలరేగిన ప్రకంపనలు సద్దుమణగకముందే.. అలాంటి ఉదంతాలే వెంటవెంటనే మరో రెండు సంభవించాయి. చారిత్రాత్మక రామతీర్థ క్షేత్రంలోని శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తలను వేరు చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.. మరో రెండు విగ్రహాల ధ్వంసానికి పూనుకోవడం పట్ల ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. జగన్ సర్కార్ ప్రభుత్వ పనితీరుపై విమర్శల జడివాన కురుస్తోంది.
విశాఖ ఏజెన్సీలో..
విశాఖపట్నం జిల్లా ఏజెన్సీలోని కోమాలమ్మ అమ్మవారి పాదాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అమ్మవారి పాదముద్రలను పగులగొట్టారు. కోమాలమ్మ అమ్మవారి పాదముద్రలను ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు, గిరిజనులు, ఆదివాసీలు భక్తిప్రపత్తులతో పూజిస్తుంటారు. విశాఖపట్నం నుంచి వంట్లమామిడికి వెళ్లే మార్గంలో ఉంటాయి కోమలామ్మ అమ్మవారి పాదముద్రలు. మోదకొండమ్మ అమ్మవారికి చెల్లెలుగా భావిస్తుంటారు స్థానిక గిరిజనులు. తాజాగా ఆ విగ్రహం పాదాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం పట్ల ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి.
రాజమండ్రిలోని సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం చేతులు ధ్వంసం..
తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో గల సుబ్రహ్మణ్యస్వామి విగ్రహానికి చెందిన రెండు చేతులు కూడా ధ్వంసం అయ్యాయి. దుండగులు స్వామివారి అభయ హస్తాలను పగులగొట్టారు. విగ్రహం చేతులు పగిలి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు కారణమైన వారి కోసం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
మరింత రాజకీయ దుమారం..
విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల ఇప్పటికే భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు. రామతీర్థం కొండపై ఆందోళనకు దిగారు.. నిరసన ప్రదర్శనలను చేపట్టారు. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ఘటన చోటు చేసుకున్న రెండు రోజుల వ్యవధిలోనే కోమాలమ్మ అమ్మవారి పాదముద్రలు ధ్వంసం కావడం, సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం చేతులను పగులగొట్టిన సంఘటనలు సంభవించడం పట్ల మరింత రాజకీయ దుమారం చెలరేగే అవకాశాలు లేకపోలేదు.
సాదినేని యామిని సంచలన ట్వీట్..
విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో వరుసగా చోటు చేసుకున్న దేవతా విగ్రహాల ధ్వంసం పట్ల బీజేపీ మహిళా నాయకురాలు సాదినేని యామిని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆలయాలు, విగ్రహాలపై చోటు చేసుకుంటోన్న దాడులను తాము చూడలేకపోతున్నామని అన్నారు. దేవాలయాలు, దేవతా మూర్తులపై కొనసాగుతోన్న దాడులను చూసి తట్టుకునే శక్తి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలారోజూ బాధ పెట్టేకంటే.. రాష్ట్రంలోని హిందువులందరినీ నరికేయండి అని చెప్పారు.