జగన్ కేసీఆర్ తో చేయి కలిపితే సహించేది లేదు..! వైసీపి మాజీ వ్యవస్థాపక అద్యక్షుడు శివకుమార్.
విజయవాడ: పాదయాత్ర ముగించుకుని పార్టీ వ్యవస్థాగత బలోపేతం పై ద్రుష్టి సారించిన వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డికి కంటిలో నలుసులా పరిణమించాడు ఆ పార్టీ మాజీ వ్యవస్థావక అద్యక్షుడు కొలిశెట్టి శివకుమార్. పార్టీ సిద్దాంతలకు విరుద్దంగా ప్రవర్తిస్తే సహించేది లేదని ఏకంగా జగన్మోహన్ రెడ్డికే అల్టిమేటం జారీ చేసారు శివకుమార్. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అపార గౌరవంతో పార్టీ స్థాపించానని, వైయస్ ను వ్యతిరేకించిన వారితో జగన్మోహర్ రెడ్డి చేతులు కలిపితే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరిస్తున్నారు. పార్టీ బలోపేతం చేయడమే కాకుండా అదికారంలోకి తెస్తానని జగన్ మాటిస్తేనే పార్టీలో చేర్చుకున్నానని శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
వైఎస్.రాజశేఖర్ రెడ్డి పై ఉన్నఅభిమానంతో తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టానని వ్యవస్థాపక అధ్యక్షులు కొలిశెట్టి శివకుమార్ అన్నారు. ఇద్దరం కలిసి పార్టీని నడుపుదాము అని చెప్పి జగన్ చేరారని అన్నారు. ఎవరైతే రాజశేఖర్ రెడ్డి ని వ్యక్తిగతంగా అనరాని మాటలతో దూషించారో, ఆ కేసీఆర్ తో కలిసి వైసీపీని తెలంగాణలో భ్రష్టు పట్టించారని ఆరోపించారు.
తెలంగాణ లో కేసీఆర్ తో కలిసి వెళ్లాడాన్ని ప్రశ్నించినందుకు తనను పార్టీ నుండి సస్పెండ్ చేశారని శివకుమార్ ఆవేదన వ్యక్తం చేసారు. వైసీపీ పగ్గాలను తిరిగి తానే చేపడతానని, ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశానన్నారు శివకుమార్. ఎన్నికల కమిషన్ లో ఇంకా తన పేరు మీదే పార్టీ కొనసాగుతోందని తెలిపారు. ఈనెల 18న విజయవాడలో లేదా గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తానని శివకుమార్ అన్నారు.