అందుకు మేం సిగ్గుపడుతున్నాం, పీకల దాకా కోపం: రోజా ఆసక్తికర వ్యాఖ్యలు
చిత్తూరు: ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పుట్టినందుకు అందరం సిగ్గుపడుతున్నామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా ఆసక్తికర, తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో మంగళవారం పాల్గొన్నారు.
చదవండి: పవన్ కళ్యాణ్, జగన్లపై బీజేపీ నేత కన్నా కీలక వ్యాఖ్యలు
ఆయన పాదయాత్ర చంద్రగిరి నుంచి నగరి నియోజకవర్గంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ఓ ఛానల్తో మాట్లాడారు.. వైయస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు పథకాలపై ప్రజల్లో సంతోషం, హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయని ఆమె అన్నారు. చిత్తూరు జిల్లాకు చంద్రబాబు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు.
చదవండి: మహేష్ కత్తిపై షాకింగ్ కామెంట్స్: 'తప్పు చేశా, అమ్మాయిల ఫోన్ నెంబర్లు అడిగాడు'
ప్రజలం అందరం సిగ్గుపడుతున్నాం
చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పుట్టినందుకు ఈ జిల్లా ప్రజలం అందరం సిగ్గుపడుతున్నామని రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు పుణ్యమా అని ఇక్కడ చక్కెర ఫ్యాక్టరీలు మూత వేయించారని విమర్శించారు. జన్మభూమి పేరుతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు.
చంద్రబాబుపై పీకల దాకా కోపం
చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన 600 హామీలు తుంగలో తొక్కారని రోజా అన్నారు. అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబుపై పీకల దాకా కోపంతో ఉన్నారని చెప్పారు. ఎన్నికలు వస్తున్నాయని అరకొరగా ఇల్లు మంజూరు చేస్తున్నారని చెప్పారు. అది కూడా తెలుగు తమ్ముళ్లకు మాత్రమే అన్నారు.
ప్రజలు బాగా నమ్ముతున్నారు
వైయస్ రాజశేఖర రెడ్డి మాదిరిగా వైయస్ జగన్ కూడా నవరత్నాల ద్వారా అన్ని వర్గాలకు భరోసా కల్పిస్తున్నారని రోజా చెప్పారు. వైయస్సార్ కుటుంబం ఒక్క మాట ఇస్తే మడమ తిప్పరని ప్రజలు కూడా బాగా నమ్ముతున్నారని చెప్పారు.
పిల్లల బాధ్యత జగన్
వైయస్ రాజశేఖర రెడ్డి అలాంటి పాలన చేశారని, అలాగే ఇప్పుడు జగన్ కూడా ఆయన బాటలో నడుస్తున్నారని రోజా చెప్పారు. పిల్లలను చదివించే బాధ్యత వైయస్ జగన్ తీసుకుంటున్నారని చెప్పారు. మద్యం వల్ల చాలా కుటుంబాలు నాశనం అవుతున్నాయన్నారు. ఎక్కడపడితే అక్కడ చంద్రబాబు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారన్నారు.