సంపద సృష్టి కోసమే వెళ్లాం.. వ్యవసాయం,సోలార్, విండ్ ఎనర్జీపై దృష్టి: అమెరికా పర్యటనపై సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu's America Tour
అమరావతి: ఏపీలో సంపద సృష్టి కోసమే అమెరికాలో పర్యటించినట్లు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పర్యటనలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ ప్రతి నిమిషాన్నీ సద్వినియోగం చేసుకున్నామని చెప్పారు. ప్రధానంగా వ్యవసాయం, సోలార్, విండ్ ఎనర్జీ, టెక్నాలజీపైనే దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు.
ప్రపంచంలోని ప్రతి నలుగురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లలో ఒకరు మన భారతీయుడని, ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు తెలుగువారు ఉన్నారని అంటూ.. అసలు రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే తాము ఐటీ అండ్ ఇన్ఫర్మేషన్ రంగంపై దృష్టి పెట్టామని, ఆ ఫలితాలను ఇప్పుడు ప్రజలు చూస్తున్నారన్నారు.
మైక్రోసాఫ్ట్ మొదలుకొని గూగుల్ వరకు మన దేశానికి వచ్చేలా చేశామని, అమెరికాలో ఉన్న హోటల్స్ లో మన గుజరాత్ వాళ్లవే అధికమని, మనవాళ్లు అక్కడ అన్ని రంగాల్లో బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తున్నారని చెప్పారు. పంజాబ్ వాళ్లు వ్యవసాయం చేసేందుకు అమెరికా వెళితే, మన తెలుగువాళ్లు మాత్రం వృత్తి నిపుణులుగానే వెళ్లారని, అమెరికాలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న వాళ్లు మన తెలుగు వాళ్లేనని చంద్రబాబు తెలిపారు.
ప్రపంచంలో మన తెలుగు వాళ్లకు ఒక ప్రత్యేక స్థానం ఉండాలని చెప్పానని, ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్కు కర్నూలులో రాబోతున్నట్లు తెలిపారు. ప్రజలు తమ ఇళ్లపైన సోలార్ పరికరాలు అమర్చుకుని, ఇంట్లో స్టోరేజ్ చేసుకుంటే ఆ విద్యుత్ ను వారు వినియోగించుకోవడమే కాక ప్రభుత్వానికీ కూడా అమ్మొచ్చని వివరించారు.
రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలు రాబోతున్నాయని, తాను అమెరికా పర్యటనలో ఎలక్ట్రిక్ కార్లు, డ్రైవర్ లెస్ కార్లు చూశానని చెప్పారు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా ఏపీతో అనుసంధానం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీని నాలెడ్జి హబ్ గా మార్చాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
అమెరికాలో స్టార్టప్ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అమెరికాలో మన వాళ్లు వ్యాపారాల్లో బాగా రాణిస్తున్నారని, ప్రపంచంలో ప్రస్తుతం నాలుగో పారిశ్రామిక విప్లవం నడుస్తోందని, ఏ ప్రయోగం అయినా అక్కడి సిలికాన్ వ్యాలీలోనే జరుగుతోందని, తాము తమ పర్యటనలో అనేక సంస్థల చైర్మన్లు, సీఈఓలను కలిశామని ఆయన వివరించారు.
అన్ని వ్యవసాయ పంపు సెట్లను సోలర్ కు మార్చేందుుకు ప్రయత్నిస్తున్నామని, విద్యుత్ రంగంలో రెండో దశ సంస్కరణలకు నాంది పలుకుతున్నామని, ఇది అమల్లోకి వస్తే ఇప్పుడున్న పవర్ ప్రాజెక్టులు మూతపడతాయని, సోలార్ విద్యుత్ తయారీ పెరుగుతుందని, ఇందులో స్టోరేజి చేసుకోవడమే ప్రధానమని చెప్పారు.
తాను అమెరికా పర్యటనలో అధిక సమయం వ్యవసాయ రంగానికే కేటాయించానని, ఎందుకంటే అమెరికా వాళ్లు ఆ రంగంలో చాలా ముందున్నారని అన్నారు. కర్నూలు కేంద్రంగా మెగా సీడ్ పార్క్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని, దీనికోసం అమెరికాలోని అయోవా యూనివర్సిటీతో ఒప్పదం చేసుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివరించారు.