పవన్ కళ్యాణ్ పూజల వివాదం:ఆయన చెప్పడం వల్లే ఆ సమయంలో పూజలు...అర్చకుడి వివరణ
ఏలూరు:పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐ.ఎస్.జగన్నాథపురంలో లక్ష్మీనరసింహస్వామికి పవన్ కళ్యాణ్ సోమవారం తెల్లవారుజామున చేసిన పూజలు వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే.
ఈ వివాదం చివరకు ఈ పూజలు నిర్వహించిన అర్చకుడికి మెడకు చుట్టుకుంది. నిబంధనల ప్రకారం ఈ దేవాలయంలో తెల్లవారుజామున ఐదు గంటల తరువాతే పూజలు ప్రారంభించాల్సి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ అంతకంటే ముందే ఇక్కడ పూజలు నిర్వహించడం రగడకు దారితీసింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా దేవస్థానం అధికారులు పూజారిని ఆదేశించారు. దీంతో పవన్ చెప్పడం వల్లే తాను ఆ సమయంలో పూజలు చేయాల్సివచ్చిందని ఆ పూజారి వివరణ ఇచ్చారట.
పశ్చిమగోదావరి జిల్లాలోని ఐ.ఎస్.జగన్నాథపురంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ సోమవారం సుమారు నాలుగు గంటల సమయంలో పూజలు చేయించినట్లు బైటపడటం కలకలం రేపింది. ప్రజాపోరాటయాత్రలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ జంగారెడ్డిగూడెం నుంచి వేకువఝామున బయలుదేరి సుమారు నాలుగు గంటల ప్రాంతంలో ఆలయం వద్దకు వచ్చారట.
అర్చకుడికి కబురు చేసి స్వామివారికి పూజలు చేయాలని కోరారట. తాను ఆలయానికి వస్తున్నట్లు ముందుగానే అందరికీ తెలిస్తే జనాల తాకిడితో భక్తులకు ఇబ్బందులు తలెత్తుతాయని...అందువల్ల పూజలు నిర్వహిస్తే వెళ్లిపోతానని పవన్ చెప్పారట. దీంతో అర్చకులు పూజా కార్యక్రమాలు చేపట్టారని చెబుతున్నారు. అయితే దీనిపై దుమారం రేగడంతో దేవస్థానం అధికారులు ప్రధాన అర్చకుడిని వివరణ అడిగారు.
అయితే భద్రతా కారణాలు, అభిమానుల తాకిడి వంటి వాటి గురించి పవన్ కళ్యాణ్ చెప్పడంతోనే ముందుగా పూజలకు ఉపక్రమించామని ప్రధాన అర్చకుడు సూర్యప్రకాశ్ అధికారులకు వివరణ ఇచ్చుకున్నారు. కాగా గతంలో ఇదే ఆలయంలో పవన్ తాంత్రిక పూజలు చేసినట్టు సినీ విమర్శకుడు కత్తి మహేశ్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలావుంటూ నిన్న పశ్చిమగోదావరి జిల్లా ఐ.ఎస్.జగన్నాథపురంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం గుర్వాయిగూడెంలోని మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ఉదయాన్నే ఆలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్కు ఆలయమర్యాదలతో అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు పవన్కళ్యాణ్కు ఆశీర్వచనాలు అందచేశారు.