వాస్తవాలు తెలుసుకోకుండా మంత్రులు నోరుపారేసుకోవద్దు: అంబటి రాంబాబు
విశాఖపట్నం ఎయిర్పోర్టులో ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్ పై దాడి జరగడాన్ని తీవ్రంగా ఖండించారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ఇందులో కచ్చితంగా కుట్రదాగి ఉందన్నారు. ప్రచారం కోసమే వైసీపీ అధినేత జగన్పై దాడి జరిగిందని డీజీపీ ఠాకూర్ చెప్పడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు అంబటి రాంబాబు. డీజీపీనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇక ఏపీ పోలీసులపై నమ్మకం లేదని... ఘటన వెనక ఉన్న మోటో ఏంటో తెలియాలంటే కేసును సీబీఐకి అప్పగించాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.
జగన్పై దాడి: లోకేష్ నుంచి పవన్ వరకు నేతల స్పందన, 'పిరికిపంద చర్య-అనుమానాలు'
దాడికి ఉపయోగించిన కత్తి చాలా పదునైంది..ప్రాణాలే పోయేవి
వైయస్ జగన్పై దాడి చేసేందుకు వినియోగించిన కత్తి చాలా పదునైనదని అంబటి రాంబాబు అన్నారు. మెడపై పొడిచేందుకు శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రయత్నించాడని కానీ జగన్ అలర్ట్ కావడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని చెప్పారు. ఒకవేళ అది నిజంగానే మెడపై తగిలిఉంటే ప్రాణాలుపోయేవని అంబటి చెప్పారు. వాస్తవాలు వెలికి తీసేందుకు డీజీపీ ఆసక్తి చూపకపోగా... అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అంబటి ధ్వజమెత్తారు. ఇక విచారణ ఎలా సాగుతుందో కూడా డీజీపీ మాటలే చెబుతున్నాయన్నారు.
అభిమానులు ఎవరైనా దాడి చేస్తారా..?
జగన్పై దాడి చేసిన వ్యక్తి శ్రీనివాస్ వైసీపీ అభిమాని అని చెబుతున్నారని... ఒకవేళ నిజంగానే వైసీపీ అభిమాని అయితే సొంత నేతపై ఎందుకు దాడి చేయాలనుకుంటారని ప్రశ్నించారు. ఈ దాడి అభిమానం ముసుగులో జరిగినదని దీని వెనక పెద్ద కుట్రే దాగి ఉందని అంబటి రాంబాబు అన్నారు. శ్రీనివాస్ ఏ పార్టీకి చెందిన వ్యక్తో ఇంతవరకు మంత్రులు కానీ, పోలీసులు కానీ చెప్పడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడుపై మావోలు దాడి చేసిన సమయంలో అప్పటి విపక్షనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరుపతిలో ధర్నా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దాడి వెనుక వాస్తవాలను తెలుసుకొనే ప్రయత్నం చేయాలన్నారు.
గతేడాది జనవరి 26న విశాఖ ఎయిర్పోర్టులో జగన్ను ఎలా అరెస్టు చేశారు..?
విశాఖ ఎయిర్పోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి రాదని చెబుతున్న మంత్రులు... గతేడాది జనవరి 26వ తేదీన జగన్ను ఇతర వైసీపీ నేతలను రాష్ట్రప్రభుత్వం ఎయిర్పోర్టులో ఎలా నిర్భంధించిందని ప్రశ్నించారు. ఆనాటి విశాఖ సీపీ ఎయిర్పోర్ట్లోకి వచ్చి జగన్తో పాటు వైసీపీ నేతలను అరెస్ట్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియకముందే మంత్రులు నోరుపారేసుకోవడం మంచిది కాదని... వారికి ప్రజలే గట్టి బుద్ది చెబుతారని అంబటి రాంబాబు చెప్పారు.
భవిష్యత్తు గురించి చెప్పే గరుడ శివాజీని ముందు అరెస్టు చేయాలి
సినీనటుడు శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడాలో భాగంగానే ఈ దాడి జరిగిందా అని మీడియా వారు ప్రశ్నించగా... అసలు శివాజీ రాజాను అరెస్టు చేసి విచారణ చేస్తే అసలు ఇంకా ఎన్ని కుట్రలు దాగి ఉన్నాయో బయటకు వస్తాయని అంబటి రాంబాబు అన్నారు. నిజనిజాలు బయటపెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిపై ఉందని..విచారణ నిష్పక్షపాతంగా జరగాలని డిమాండ్ చేశారు అంబటి రాంబాబు. దాడిపై డీజీపీ, డీఎస్పీ, టీడీపీ నేతలు వేర్వేరుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దీనికి రాజకీయ రంగును పులిమేందుకు ప్రయత్నిస్తున్నారని అంబటి ధ్వజమెత్తారు.