ఏపీ ఆశలపై మరోసారి నీళ్లు .. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చిన కేంద్రం
Recommended Video
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ఆశలపై ఎన్డీఏ సర్కార్ మరోసారి నీళ్లు చల్లింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అధికార వైసీపీ, విపక్ష టీడీపీ కొరుతున్నాయి. మరోసారి కేంద్రంలో అధికారం చేపట్టిన ఎన్డీఏ స్పెషల్ స్టేటస్ ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది. ఏపీకి ఇస్తే .. మరో 7 రాష్ట్రాలకు ఇవ్వాల్సి వస్తున్నందున .. ఏ రాష్ట్రానికి ఇవ్వబోమని స్పష్టంచేసింది.
హోదా లేదు ..
ప్రత్యేక హోదాపై బీహర్ ఎంపీ కౌశలేంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని తేల్చిచెప్పారు. ఏపీ ప్రత్యేక హోదా అడిగితే .. తెలంగాణ, ఒడిశా, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, బీహర్ సహా 7 రాష్ట్రాలకు ఇవ్వాల్సి వస్తోందని చెప్పకనే చెప్పారు. ఆ రాష్ట్రాల నుంచి కూడా వినతులు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. అలాగే పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు .. హోదాకు సంబంధం లేదని స్పష్టంచేశారు. ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని బట్టి పరిశ్రమలకు రాయితీలు ఇస్తామని .. కానీ దానిని ప్రత్యేక హోదాతో ముడిపెట్ొద్దని తేల్చిచెప్పారు.
ఇదీ పద్ధతి .. కానీ ...
వాస్తవానికి ప్రత్యేక హోదా అనేది ప్రణాళిక మద్దతు కోసం అని నిర్మలా సీతారామన్ వివరించారు. దీనిని జాతీయ అభివృద్ధి మండలి సిఫారసు చేస్తుందని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం జాతీయ అభివృద్ధి మనుగడలో లేదని .. అలాంటప్పుడు స్పెషల్ స్టేటస్ అనేది లేదని స్పష్టంచేశారు. దేశంలో కొత్తగా ఏ రాష్ట్రానికి హోదా ఇవ్వబోమని తేల్చిచెప్పారు. దీంతో ఇటీవల అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం జగన్ .. ఏపీకి హోదా కోసం ప్రధాని మోడీని విన్నవించారు. అయినా కేంద్రం మాత్రం తమ వైఖరిని తెలియజేసింది.
టీడీపీ నుంచి వైసీపీ వరకు ...
మోడీ తొలి ప్రభుత్వంలో అప్పటి అధికార టీడీపీ భాగస్వామ్యంగా కొనసాగింది. హోదా ఇవ్వమని కేంద్రం చెపితే ప్యాకేజీకి అంగీకరించింది. కానీ ఎన్నికలు ఏడాది ఉందనగా ఆ పార్టీ స్వరం మారింది. తమకు హోదానే ముఖ్యమని ఎన్డీఏ నుంచి బయటకొచ్చింది. ఆ పార్టీపై తిరుగుబాటు ఎగరేసింది. మోడీ, బీజేపీని విమర్శించింది. అయినా టీడీపీ మాటలను ప్రజలు విశ్వసించలేదు. ఏపీలో వైసీపీకి పట్టం కట్టారు. అసెంబ్లీ కాదు .. లోక్సభ స్థానాలు కూడా వైసీపీ గెలుచుకుంది. టీడీపీ కేవలం 3 సీట్లకే పరిమితమైంది. కేంద్రంలో భారీ మెజార్టీ సాధించిన ఎన్డీఏ .. ఆయా రాష్ట్రాల డిమాండ్లను బుట్టదాఖలు చేశామనే సంకేతాలను ఇచ్చింది.