కాంగ్రెస్లో ఉండను: జెసి, చూస్తానన్న టిజి వెంకటేష్
ఆహ్వానాలు వస్తున్నాయి: టిజి
రాష్ట్ర విభజన ఆగుతుందని ఆశిస్తున్నానని రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమైక్యవాదం వినిపిస్తున్నారని అన్నారు. వివిధ పార్టీల నుంచి తనకు ఆహ్వానాలు వస్తున్న మాట వాస్తవమేనని టిజి చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే ప్రజలు, కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకుంటానని టిజి వెంకటేష్ తెలిపారు.
పార్టీలన్నీ లేఖలు ఇచ్చాయి: పనబాక
రాష్ట్ర విభజనకు అనుకూలంగా అన్ని పార్టీలు కేంద్రానికి లేఖలు ఇచ్చాయని కేంద్రమంత్రి పనబాక లక్ష్మీ అన్నారు. సమన్యాయం అంటే ఏమిటో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునే అడగండని ఆమె అన్నారు. డిక్షనరీలో సమన్యాయానికి అర్థం తెలియడం లేదని పనబాక అన్నారు.
రాష్ట్రాన్ని విభజించాలని, రూ. లక్షల కోట్ల ప్యాకేజి ఇవ్వాలని చంద్రబాబు కోరారని తెలిపారు. విభజన విషయంలో చంద్రబాబు మాట మార్చారని ఆమె అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో అధిష్టాన నిర్ణయానికే కట్టుబడి ఉంటానని, ప్యాకేజి గురించి తాను కూడా కేంద్రాన్ని అడిగినట్లు చెప్పారు.
కాగా తాను సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉన్నట్లు రాష్ట్ర మంత్రి కాసు కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో విభజన బిల్లును వ్యతిరేకించి తీరుతామన్నారు. అన్ని పార్టీలు రాజకీయాలను పక్కన బెట్టి రాష్ట్ర సమైక్యత కోసం పోరాటం చేయాలని మంత్రి కాసు పిలుపునిచ్చారు.