హైదరాబాద్ వరద బాధితుల్లా కాదు, రైతులను ఆదుకోవాలి: పవన్ కళ్యాణ్, వైసీపీ ఎమ్మెల్యే తండ్రి వేదన
కృష్ణా: నివర్ తుపానుతో నష్టపోయిన ప్రతి రైతుకు ఆర్థిక సాయం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. అన్నం పెట్టే రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదన్నారు. బుధవారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
రైతుల్లో గుండె నిబ్బరం నింపేందుకే..
రైతులతో సమావేశమై వారు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. ఉయ్యూరులో కుళ్ళిన వరి కంకులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉయ్యూరులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. "నివర్ తుపాన్ వల్ల రైతాంగానికి జరిగిన నష్టం తెలుసుకోవడానికే క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నాను. రైతాంగానికి వెన్నుదన్నుగా ఉంటాం. వాళ్లలో గుండె నిబ్బరం నింపడానికే వచ్చాను' అని అన్నారు.
అప్పటి వరకు జనసేన పోరాటం..
‘పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి విపత్తుతో రైతులు నష్టపోవడం బాధాకరం. అప్పుల పాలవుతున్న రైతులను మరింత కుంగదీసేలా నష్టాలు ఉన్నాయి. నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందే వరకు జనసేన పార్టీ పోరాటం చేస్తుంది. ఆ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది' అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ వరద బాధితుల్లా కాదు..
కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని పెదప్రోలులో పవన్ నివర్ బాధిత రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు వారికి జరిగిన నష్టాన్ని జనసేనానికి వివరించారు. హైదరాబాద్లో వదరలు వచ్చి ఇల్లు మునిగితే బాధితులకు రూ. 10 వేలు చొప్పున ఇస్తున్నారని, ఇక్కడ ఎకరం పొలం మునిగితే ప్రభుత్వం అంతే ఇవ్వడం సరికాదన్నారు. ఆ పరిహారం రైతులకు ఏమాత్రం సరిపోదన్నారు. ఎకరానికి రూ. 25 వేల నుంచి రూ. 30 వేల వరకు పరిహారం అందించాలని పవన్ డిమాండ్ చేశారు.
48 గంటల్లో రైతులకు పరిహారం ఇవ్వాలి..
కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. పొలం యజమానులతో సమానంగా వారికీ పరిహారం అందించాలన్నారు. 48 గంటల్లో నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు తక్షణ సాయం కింద రూ. 10వేలు అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు పరిహారం పెంచకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రైతులకు అండగా ఉంటామని, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
శాసనసభలో రైతులకు వచ్చిన నష్టంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
పవన్ కళ్యాణ్తో వైసీపీ ఎమ్మెల్యే తండ్రి ఆవేదన
కృష్ణా జిల్లాలో నివర్ ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించేందుకు పర్యటించిన పవన్ కళ్యాణ్ను వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి తండ్రి, మాజీ ఎంపీ రెడ్డయ్య కలిశారు. పెద్దపూడి అడ్డురోడ్డు వద్ద కలిసిన ఆయన.. రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ప్రభుత్వం నమోదు చేస్తున్న పంట నష్టం అంచనాలన్నీ తప్పులేనని ఆరోపించారు. ఏ ప్రభుత్వం వచ్చినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు జరుగుతున్న అన్యాయంపై రౌండ్ టేబుల్ సమావేశం పెడదామని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చెప్పారు.