మేం 151 మందిమి ఉన్నాం..! తలుచుకుంటే ఒక్కరు కూడా మీ స్థానాల్లో ఉండరు..!ప్రతిపక్షంపై జగన్ ఆగ్రహం..!!
అమరావతి/హైదరాబాద్ : ఏపి అసెంబ్లీ రెండోరోజు ప్రారంభం కాగానే వాడి వాడి ఆరోపణలతో అట్టుడికి పోయింది. ప్రతిపక్షం పై అదికార పార్టీ నేతలు మరోసారి మండిపడ్డారు. సభానాయకుడు, ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి త్రీవ్ర పదజాలంతో ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడ్డారు. సున్నా వడ్డీ పథకం గొప్పగా అమలు చేసినట్టు చంద్రబాబు చెబుతున్నారని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. ఆయన ఎలా ఉన్నారో.. వారి సభ్యులు కూడా అలానే ఉన్నారని ఎద్దేవా చేశారు.
సున్నా వడ్డీ పథకంపై అసెంబ్లీలో జరుగుతున్న వాడీవేడి చర్చలో భాగంగా జగన్ మాట్లాడుతూ.. వడ్డీ కింద 1186 కోట్ల రూపాయలు కట్టాల్సిన ప్రభుత్వం 44.31 కోట్ల రూపాయలు మాత్రమే కట్టిందని ఆరోపించారు. రైతులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలంటే, 2283 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 34 కోట్ల రూపాయలు ఇచ్చారని ఘాటుగా విమర్శించారు.
ఆగ్రహంతో రెచ్చిపోయిన జగన్..! మీ స్థానాల్లో కూర్చోలేరని హెచ్చరికలు..!!
ఇదేమన్నా అసెంబ్లీ అనుకున్నారా లేక పశువుల సంత అనుకున్నారా అంటూ ఎపి సీఎం ప్రతిపక్షం మీద ఎదురుదాడి చేసారు. " మీ మాదిరిగా నేను కామెంట్స్ చేయడం మొదలుపెడితే.. మీరు చేసినట్లే నేను కూడా చేయడం మొదలుపెడితే(ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై).. ఒక్కసారి మేం డిసైడ్ చేస్తే మేం 151 ఎమ్మెల్యేలు ఉన్నాం.. మీ వాళ్లు 23 మంది మాత్రమే ఉన్నారు.. మేం తలుచుకుంటే అసెంబ్లీలో ఎవరూ కనిపించరు అధ్యక్షా. ప్రతిపక్ష పార్టీ సభ్యులు మాట్లాడేటప్పుడు మేం ఇబ్బంది పెట్టలేదు.. అడ్డు రాలేదు. మీరు మాట్లాడిన తర్వాత సమాధానంగా.. ముఖ్యమంత్రిగా నేను మాట్లాడుతుంటే అడ్డు తగులుతారా..?. అదే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేం మాట్లాడుంటే.. ఏం ఏం ఏం ఇదేం పశువుల సంత అనుకున్నారా లేకుంటే శాసనసభ అనుకుంటున్నారా..?. ఎలాంటోళ్లను తయారు చేశారయ్యా.. మీరు.. మొత్తం రౌడీలను, గూండాలను తీసుకొచ్చారు" అని టీడీపీ సభ్యులు, అధినేతపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended Video
జీరో వడ్డీ పై వాడివేడి చర్చ..! రికార్డ్ చూపించిన జగన్..!!
2014లో 1184 కోట్ల రూపాయలకు గాను 44.31 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించారని తెలిపారు. 2015లో 2283 కోట్ల రూపాయలకు గాను కేవలం 31 కోట్లు రూపాయలు చెల్లించారన్నారు. 2016లో 2354 కోట్ల రూపాయలకు గాను 249 కోట్ల రూపాయలు చెల్లించారని పేర్కొన్నారు. ఐదేళ్లలో 11600 కోట్లు ఇవ్వాల్సి ఉంటే 630 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారన్నారు. రైతుల రుణాలన్నీ చెల్లించామని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారని జగన్ పేర్కొన్నారు.
చంద్రబాబుపై జగన్ ఆగ్రహం..! మనుషులా రౌడీలా అంటూ ప్రశ్న..!!
ఏపీ అసెంబ్లీలో వడ్డీ లేని రుణాలపై సభలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటున్నారని జగన్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు బేసిక్ రూల్స్ తెలియవని.. ఏమైనా అంటే 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటారని సీఎం ఎద్దేవా చేశారు. మేం విపక్షంలో ఉన్నప్పుడు వాయిదా తీర్మానాలపై చర్చించలేదన్న విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. మొదటిసారిగా వాయిదా తీర్మానంపై చర్చకు అంగీకరించామని పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ కింద గత ప్రభుత్వం రూ.3036 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఇవ్వలేదని జగన్ మరోసారి చెప్పుకొచ్చారు. పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ పథకం గత ప్రభుత్వంలో ఉన్నట్టా.. లేనట్టా? అని ఈ సందర్భంగా ప్రతిపక్షానికి వైఎస్ జగన్ సూటి ప్రశ్న సంధించారు.
సోషల్ ఎకనమిక్ సర్వే రిపోర్టులను సభలో పెట్టిన బాబు..!ఎద్దేవా చేసిన అదికార పార్టీ..!!
ఏపీ అసెంబ్లీలో సున్నా వడ్డీపై చర్చ కొనసాగుతోంది. మొదట ఈ విషయంపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిందేమీ లేదని టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సున్నా వడ్డీ రుణాలపై మేం చర్చకు సిద్ధం అని జగన్ సవాల్ విసిరారు. సున్నా వడ్డీ రుణాలపై ప్రజలకు నిజానిజాలు తెలియాలన్నారు. ఇదిలా ఉంటే.. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సభకు డాక్యుమెంట్ సమర్పించారు. సోషల్ ఎకనమిక్ సర్వే రిపోర్టులను చంద్రబాబు సభలో పెట్టారు. తనను రాజీనామా చేయాలని అడుగుతారా..? అని చంద్రబాబు ప్రశ్నించగా ఇందుకు స్పందించిన వైఎస్ జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.