కాంగ్రెస్ మాకు చెప్పిందొకటి చేసిందొకటి, వారికే మద్దతు: రాజ్యసభ ఎన్నికపై విజయసాయి
న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు దూరంగా ఉండాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి గురువారం మరోసారి ప్రకటన చేశారు. రెండు రోజుల క్రితమే తాము ఎన్డీయే కూటమికి మద్దతివ్వమని చెప్పారు. విపక్షాల అభ్యర్థిగా కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు నిలవడంతో వైసీపీ దూరంగా ఉండాలని నిర్ణయించింది.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక: టీడీపీ ఊహించని నిర్ణయం, కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు
ఎన్డీయే తరఫున జేడీయూ అభ్యర్థి హరివంశ్ బరిలో నిలిచారు. విపక్షాల అభ్యర్థిగా కాంగ్రెస్ నేత హరిప్రసాద్ నిలిచారు. దీంతో విపక్షాల అభ్యర్థి కాబట్టి హరిప్రసాద్పై చర్చించాల్సి ఉందని వైసీపీ బుధవారం చెప్పింది. కానీ బరిలో కాంగ్రెస్ నేత దిగడంతో దూరం జరిగింది. దీనిపై విజయసాయి మాట్లాడారు. తాము బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మద్దతివ్వకూడదని నిర్ణయించామన్నారు.
కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే
కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాయని విజయసాయి రెడ్డి అన్నారు. విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. విభజన హామీల అమలు విషయంలో బీజేపీ మోసం చేసిందన్నారు. ఆ రెండు పార్టీలు.. దొందూ దొందే అన్నారు. మోసం చేసిన రెండు పార్టీలతో టీడీపీ రాజకీయ వ్యభిచారం చేస్తోందన్నారు. రాష్ట్రాన్ని గొడ్డలితో నరికిన పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. వైద్యం చేస్తామని హామీ ఇచ్చి, ద్రోహం చేసిన పార్టీ బీజేపీ అన్నారు. కాబట్టి బీజేపీ మిత్రపక్షాలను నిలబెట్టినా బలపర్చేది లేదన్నారు.
Recommended Video
మేం పోటీ చేయమని కాంగ్రెస్ చెప్పింది
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ తమకు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి అని విమర్శించారు. ఎన్డీయే తరఫున జేడీయూ ఎంపీ నిలబడితే, విపక్షాల తరఫున తాము నిలబడమని, ఎన్సీపీ లేదా ఎస్పీ లేదా బీఎస్పీ నుంచి బరిలోకి దింపుతామని చెప్పిందని, కానీ నిన్నటికి నిన్న వారి విధానం మార్చుకొని విపక్షంలోని మిత్రపక్షాలకు కాకుండా కాంగ్రెస్ అభ్యర్థి బరిలోకి దిగారన్నారు. అందుకే తాము మద్దతివ్వదల్చుకోలేదని చెప్పారు.
మా మద్దతు వారికే
ఏపీకి కాంగ్రెస్, బీజేపీ మోసం చేశాయన్నారు. ద్రోహం చేసిన రెండు పార్టీలకు ఓటు వేయవద్దని నిర్ణయించుకున్నామని చెప్పారు. వారికి ఓటు వేస్తే విభజనకు ఓటు వేసినట్లే అవుతుందన్నారు. ప్రత్యేక హోదా అయిదేళ్లు కాదు పదేళ్లని, తాము న్యాయం చేస్తామని, 13వ షెడ్యూల్లో పొందుపర్చిన అంశాలతో పాటు మరిన్ని అమలు చేస్తామని చెప్పిన బీజేపీ చేయలేదని చెప్పారు. అలాగే కాంగ్రెస్ అన్నింటిని చట్టంలో పొందుపర్చి ఉంటే న్యాయం జరగేదన్నారు. కానీ కాంగ్రెస్ అలా తీవ్ర అన్యాయం చేసిందన్నారు. రైల్వే జోన్ విషయంలో బీజేపీ మోసం చేసిందన్నారు. తాము హామీలను నమ్మేది లేదని, 2019లో ఏ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఆ పార్టీకి మద్దతిస్తామని చెప్పారు.
అందుకే ఓటేశాం
ఎన్నికలకు గైర్హాజరవుతే బీజేపీకి అండగా నిలిచినట్లవుతుందని టీడీపీ చెబుతోందని ప్రశ్నించగా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు రాజ్యాంగపరమైనవని, అందుకే ఏకగ్రీవం అయ్యేందుకు ఓటు వేశామని, కానీ రాజ్యాంగేతర పదవులకు మాత్రం కాంగ్రెస్, బీజేపీలకు మద్దతిచ్చేది లేదన్నారు. ఈ విషయానికి తాము ఎప్పటికీ కట్టుబడి ఉన్నామన్నారు. అసలు యూపీఏ ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్సేతర అభ్యర్థిని ప్రతిపక్షం తరఫున నిలబెడితే మద్దతిచ్చేవాళ్లమని చెప్పారు.