చంద్రబాబు అత్తగారికి కూడా పదవీ, ఎస్సీ,ఎస్టీ,బీసీలకు 50శాతం పదవులు, అసెంబ్లీలో జగన్
బడుగు, బలహీనవర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టంచేశారు. మంత్రివర్గం, నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం పదవులు ఇస్తున్నామని పేర్కొన్నారు. సలహాదారు పదవులు నామినేటెడ్ కానందున.. నైపుణ్యం ఉన్నవారిని నియమిస్తున్నామని బుధవారం శానససభలో సీఎం జగన్ స్పష్టంచేశారు. బడుగు, బలహీనవర్గాలకు అన్యాయం చేస్తున్నారని ప్రతిపక్ష టీడీపీ ఆరోపించడంతో ఈ మేరకు ఆయన స్పందించారు.
50 శాతం పదవులు
ఆలయ కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులుగా బలహీనవర్గాలకు అవకాశం ఇస్తున్నామని జగన్ స్పష్టంచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం పదవులు కట్టబెడుతున్నామని చెప్పారు. 13 డీసీసీబీల్లో ఏడు చైర్మన్ పదవులకు బలహీనవర్గాలకు కేటాయించామని చెప్పారు. ఇందులో 50 శాతం మహిళలు ఉన్నారని నొక్కివక్కానించారు.
వీరే వారు..
నామినేటెడ్ పదవులు కల్పించిన కొందరి పేర్లను అసెంబ్లీలో జగన్ చదివి వినిపించారు. వన్ మ్యాన్ కమిషన్ చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎష్ జేసీ శర్మ, మాల వేల్ఫేర్ కమిషన్ చైర్మన్గా అమ్మాజీ, మహిళ కమిషన్ చైర్మన్గా వాసిరెడ్డి పద్మ, తెలుగు అకాడమీ చైర్ పర్సన్గా లక్ష్మీపార్వతిని నియమించామని తెలిపారు. ఇప్పటికే కొన్నింటినీ భర్తీ చేశామని, మరికొన్ని నియమించాల్సి ఉందని చెప్పారు. 160 నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తామని శాసనసభ వేదికగా జగన్ ప్రకటించారు.
క్యాబినెట్లో కూడా..
మంత్రివర్గంలో కూడా బడుగు, బలహీనవర్గాలకు చెందిన నేతలు ప్రయారిటీ ఇచ్చామని జగన్ చెప్పారు. 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారని జగన్ పేర్కొన్నారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమిస్తే అందులో నలుగురు బలహీనవర్గాలకు చెందినవారే ఉన్నారని చెప్పారు. దళిత కులానికి చెందిన మేకతోటి సుచరిత హోంమంత్రిగా ఉన్నారని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి కూడా దళితుడేనని.. సురేశ్కు పదవీ ఇచ్చామని చెప్పారు.
బాబు అత్తగారికి కూడా...
రెవెన్యూశాఖ మంత్రి పదవీ బాధ్యతలను పిల్లి సుభాష్ చంద్రబోస్కు అప్పగించామని పేర్కొన్నారు. చంద్రబాబు అత్తగారు లక్ష్మీపార్వతీకి కూడా నామినేటెడ్ పోస్ట్ కూడా ఇచ్చినట్టు తెలిపారు. బలహీనవర్గాలకు అన్యాయం చేసింది చంద్రబాబు అని జగన్ విమర్శించారు. అలాంటి నేత సభలో తమపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆయనకు మైక్ ఇవ్వడం కూడా నేరమేనని జగన్ అన్నారు.