ఏపీ, టీలపై చెప్పారు, సోనియాని కోరాం: వెంకయ్య, బాబుకు చేతకాకుంటే: సీఆర్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సమస్యలను తాము గుర్తించామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, నిధుల కేటాయింపుల పైన తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఎంపీలు అడిగారని తెలిపారు.
పార్లమెంటులో అఖిల పక్షం అనంతరం వెంకయ్య మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో విభజన సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఏపీ, తెలంగాణ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కసరత్తు చేస్తున్నారని తెలిపారు.
విభజన బిల్లులో పేర్కొన్న ప్రతి హామీని నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సభ సజావువగా సాగేందుకు సహకరించాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని తాము కోరామని వెంకయ్యనాయుడు తెలిపారు. ఆయన అంతకుముందు సోనియాను కలిశారు.
ప్రత్యేక హోదా వస్తుంది: మురళీ మోహన్
ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని మురళీ మోహన్ రాజమండ్రి ఎంపీ అన్నారు. ఏపీ సమస్యలన్నింటి పైనా కేంద్రానికి సూచనలు చేస్తున్నామని, ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలోనే ప్రత్యేక హోదా సాధించుకుంటామన్నారు. నిధుల లేమితో ఉన్న ఏపీకి కేంద్రం నిధులు ఇస్తుందన్నారు. ఏపీకి రైల్వే జోన్ వస్తుందని చెప్పారు. పోలవరం నిధులు, రాజధాని వంటివన్నీ కేంద్ర బడ్జెట్లో ఉంటాయన్నారు.
కేంద్రాన్ని చూసి చంద్రబాబు భయపడుతున్నారు: సీ రామచంద్రయ్య
ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో దూకుడుగా వ్యవహరించవద్దని టీడీపీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సూచించడం సరికాదని సీ రామచంద్రయ్య హైదరాబాదులో అన్నారు. కేంద్రాన్ని చూసి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. సొంత లబ్ధి కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు విదేశీ పర్యటనలతో కాలక్షేపం చేస్తున్నారన్నారు.
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధఇకారంలో ఉంటే అభివృద్ధి సాధ్యమన్నారని, ఇప్పుడు ప్రజలకు ఏం చేశారో అర్థం కావడం లేదన్నారు. ఏపీకి ప్ర్తయేక హోదా కోసం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రాన్ని టీడీపీ నిలదీయలేకపోతే.. ఇతర పార్టీలు ప్రశ్నిస్తాయన్నారు.