రజనీకాంత్, కమల్లతో కలిసి పని చేసే అవకాశం: పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ కూటమికి నో
అమరావతి/చెన్నై: తమిళనాడు సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్లతో కలిసి భవిష్యత్తులో పని చేసే అవకాశముందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం చెప్పారు. ఆయన చెన్నై పర్యటనలో ఉన్నారు. బుధవారం కమల్ను కలిసి మీడియాతో మాట్లాడారు. తమిళనాడు పర్యటనలో ఉన్న ఆయన రెండో రోజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
2019లో నేనే.. ఏపీ సీఎంగా పోరాడబోతున్నా: తెలంగాణ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో చెప్పిన పవన్!
సినిమా రంగంలో విజయవంతమై రాజకీయ అరంగేట్రం చేసిన రజనీకాంత్, కమల్లతో కలిసి పని చేయడంపై ఆయన స్పందించారు. జాతీయస్థాయిలో పొత్తులపై మాట్లాడారు. భవిష్యత్తులో తాను వారిద్దరితో కలిసి పనిచేసే అవకాశముందన్నారు. దక్షిణ భారతంపై ఉత్తరాది నేతలకు మరింత అవగాహన ఉండాలన్నారు.
వారి టైంలో సమస్యలు పరిష్కారమయ్యేవి
నాడు జాతిపిత మహాత్మా గాంధీ, ఉక్కు మనిషి సర్థార్ వల్లభాయ్ పటేల్ ఉన్న సమయంలో సమస్యలు పరిష్కారమయ్యేవని పవన్ కళ్యాణ్ అన్నారు. వారు దేశవ్యాప్తంగా పర్యటిస్తూ దేశస్ఫూర్తిని అర్థం చేసుకునే వాళ్లని చెప్పారు. బీజేపీ నిజంగా దేశాన్ని అభివృద్ధి చేస్తుందని తాను ఆశించి మద్దతు ఇచ్చానని, కానీ ఇప్పుడు అది నెరవేరలేదని చెప్పారు. బీజేపీ తమ ఆశలను వమ్ము చేసిందన్నారు.
కాంగ్రెస్ కూటమిలో చేరేది లేదు
బుధవారం కూడా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో పలు వ్యాఖ్యలు చేశారు. దేశానికి రెండో రాజధాని అవసరమని, దేశ రాజకీయాల్లో ఉత్తరాది హవా ఉందని, దక్షిణాది పాత్ర ఉండాలని ఆన అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా ఇచ్చి మాట తప్పిన బీజేపీకి, రాష్ట్రాన్ని ఇష్టారీతిన విభజించిన కాంగ్రెస్ పార్టీకి, అలాగే అవినీతి జగన్కు మద్దతిచ్చేది లేదని, అలాగే వారితో కలిసి చేరే ప్రసక్తి లేదన్నారు. బీజేపీయేతర కూటమికి ప్రాతినిథ్యం వహించే కాంగ్రెస్తో కలిసి పని చేస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. కాంగ్రెస్ కూటమిలో చేరే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. చంద్రబాబు కాంగ్రెస్ను ఇప్పుడు నెత్తిన పెట్టుకున్నప్పటికీ ఆయన ఎప్పుడైనా కిందపడదోస్తారన్నారు.
ప్రతి అంశంపై వివరణ పదేపదే ఇవ్వడం ఇష్టం లేదు
వైసీపీతోను పొత్తు ప్రసక్తి లేదని పవన్ తేల్చి చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, వైసీపీల మధ్య త్రిముఖ పోరు ఉంటుందని చెప్పారు. ప్రతి విషయంపై వివరణ ఇవ్వడం తనకు ఇష్టం లేదని, మళ్లీ చెబుతున్నానని, వైసీపీతో పొత్తు ఆలోచన లేదన్నారు. అన్ని స్థానాల్లోనూ జనసేన పోటీ చేస్తుందని చెప్పారు.
జగన్ విమర్శించలేరు
దక్షిణాదిలో మరింత మంది నీతిమంతులైన రాజకీయ నాయకులు రావాలని పవన్ అన్నారు. ఉదాహరణకు జగన్ను తీసుకుంటే ఆయనపై ఉన్న కేసుల కారణంగా కనీసం నీతిమంతమైన నాయకుల అవసరంపై మాట్లాడే ధైర్యం ఆయన చేయలేరన్నారు. తెలంగాణలో ఏపీ నేతలను ద్వితీయశ్రేణి పౌరులుగానే చూస్తున్నారని, చెన్నైకి ఎప్పుడొచ్చినా తనకు అలాంటి భావన కలగలేదన్నారు.