‘వనజాక్షికి రక్షణ కల్పించాలని కలెక్టర్ను కోరాం’
కృష్ణా: జిల్లాలోని ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి దాడి ఘటనపై ఏపీ ఎన్జీవో చైర్మన్ విద్యాసాగర్ స్పందించారు. వనజాక్షికి రక్షణ కల్పించాలని కలెక్టర్ను కోరినట్లు ఆయన తెలిపారు. సుపారీ తీసుకుని వనజాక్షిని చంపేందుకు కొందరు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో విద్యాసాగర్ ఆమెకు రక్షణ కల్పించాల్సిందిగా కలెక్టర్ను కోరినట్లు తెలుస్తోంది.
ఏపికి ప్రత్యేక హోదా అంశంపైనా ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 7వ తేదీన జంతర్ మంతర్ వద్ద ఏపీ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాకు ఏపీ ఎన్జీవో, జేఏసీల నుంచి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ధర్నాకు హాజరవుతున్నట్లు ఆయన చెప్పారు.
ఈ ధర్నాకు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆహ్వానిస్తామని తెలిపారు. ఆగస్టు 8వ తేదీన రాష్ట్ర ఉద్యోగ నేతలంతా కేంద్ర హోంమంత్రిని, మిగిలిన కేంద్ర మంత్రులను ఏపీ విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చమని కోరతామన్నారు.
దీంతో పాటు ఆగస్టు 10 వ తేదీన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు కూడా తాము సంఘీభావం తెలుపుతామన్నారు. రాజకీయాలకు అతీతంగా ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు ఎవరు ఉద్యమించినా తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.