పాక్లో సంబరాలు... తప్పుడు ప్రచారం ఆపండి: ఇండియన్ మీడియాపై పవన్ కళ్యాణ్, ఇవి చూడండి(వీడియో)
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు భారతదేశంలోనే చర్చనీయాంశం కావడమే కాదు.. పాకిస్తాన్కు చెందిన డాన్ పత్రికలో కూడా వార్తలు వచ్చాయి. ఎన్నికలకు ముందు యుద్ధం రాబోతుందని రెండేళ్ల ముందే తనకు తెలుసునని జనసేనాని చెప్పినట్లుగా జోరుగా ప్రచారం సాగింది. దీనిపై పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. దీనిని జనసేన ట్వీట్ చేసింది. అంతేకాదు, పవన్పై దుష్ప్రచారం చేస్తున్నారని, చెబుతూ ఆయన రెండు సందర్భాలలో మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసింది. రెండుసార్లు మాట్లాడిన మాటలను, ఒకే వీడియోలో పొందుపరిచింది.
ఇండియన్ మీడియాకు విజ్ఞప్తి
ఎన్నికలకు ముందు యుద్ధం వంటివి చోటు చేసుకుంటాయని తనకు నేరుగా ఎవరూ చెప్పలేదని, రాజకీయ విశ్లేషకులు, కొన్ని న్యూస్ ఛానల్స్ చెప్పిన జోస్యాన్ని తాను ఉదహరించానని, తాను వాటిని మాత్రమే ఉదహరించానని, కానీ తనకు తెలుసునని చెప్పలేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ వంటి విపక్షాలు బీజేపీపై ఉద్దేశ్యపూర్వకంగా యుద్ధం పేరుతో దాడి చేస్తున్నాయనే వాదనలు ఉన్నాయి. ఇందులో భాగంగా గతంలో దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఈ వీడియో క్లిప్పింగ్లో పొందుపర్చారు. అంతేకాదు, ఇండియన్ మీడియాకు ఓ విజ్ఞప్తి చేస్తున్నామని, తప్పుడు కథనాలతో దేశ ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని చెప్పారు.
పవన్ కళ్యాణ్ మాటల్లో బీజేపీ ఎక్కడ
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో బీజేపీ మాట ఎక్కడ ఉందని జనసేన ప్రశ్నించింది. తమ చేసిన వ్యాఖ్యల్లోకి బీజేపీ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తనకు బీజేపీ చెప్పిందని పవన్ ఎక్కడా చెప్పలేదని, ఇలాంటి తప్పుడు వార్తలు వద్దని జనసేన సూచించింది. ఈ సందర్భంగా రెండేళ్ల క్రితం కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పోస్టును పెట్టింది.
పవన్ ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నాలకు చెక్
పవన్ కళ్యాణ్ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నందున జనసేన వరుస ట్వీట్లు చేసింది. ఓ ట్వీట్లో... 'చాలా మందికి తెలుసు ఇది. ఎన్నికల ముందు యుద్ధం వస్తుంది అనేది నా అంచనా కాదు. పొలిటికల్ విశ్లేషకుల అంచనా, ఫైనాన్సియల్ టైమ్స్ లాంటివి చదవండి' అని పవన్ పేర్కొన్నట్లుగా ఉంది.
ఈ రోజు యుద్ధ వాతావరణం ఉంది
'ఈ రోజున సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఉంది. యుద్ధం జరుగుతాంది. యుద్ధానికి తెరదీశారు. నాకు ముందే చెప్పారు.. రెండు సంవత్సరాల క్రితం చెప్పారు... ఎన్నికలకు ముందు యుద్ధం రాబోతుందని, అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు.' అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ వ్యాఖ్యలను ఫిబ్రవరి 26, 2019న పవన్ కళ్యాణ్ అన్నట్లు జనసేన పేర్కొంది.
ఇది నా జోస్యం కాదు
'యుద్ధం ఎలా వస్తుందనేది రెండేళ్ల ముందే ఎలా తెలుసునని అంటే.. నాకేం తెలుసు, నేను ఏమైనా పాకిస్తాన్ వాళ్లతో మాట్లాడలేదు' అని పవన్ కళ్యాణ్ ఈ వీడియోలో పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ కూలుతుందని కొంతమంది ముందే జోస్యం చెప్పేవారని, అలాగే, మన దేశంలో యుద్ధం రాబోతుందని చెప్పేందుకు ముఖ్యంగా చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్పారని, అలాంటివి బయటకు రాదని, చదివితే తెలుస్తుందని, ఇంటర్నెట్లో ఉంటే తెలుస్తుందని పవన్ అన్నట్లుగా ఉంది. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లాంటివి చదివితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో కొందరు ఊహిస్తారని, అలాగే ఎన్నికలకు ముందు ఏం జరుగుతుందో కూడా చెబుతారన్నారు. ఇది కూడా తన జోస్యం కాదని, ఇతరులు చెప్పిన దానిని నేను చెప్పానని అన్నారు. అదే వీడియోలో ఈ వ్యాఖ్యలు ఫిబ్రవరి 28, 2019న జనసేనాని చెప్పారు. పవన్ అవే వ్యాఖ్యలను పునరుద్ఘాటించారని ఈ వీడియోలో జనసేన పేర్కొంది.