ట్రంప్ మనవాళ్లని ఇబ్బంది పెడుతున్నారు, అమెరికాలో ఫైట్ చేద్దాం: చంద్రబాబు
అమెరికా అధ్యక్షులు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో అక్కడ ఉన్న భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, భవిష్యత్తులో మన ఉద్యోగాలను మనమే సృష్టించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
విజయవాడ: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో అక్కడ ఉన్న భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, భవిష్యత్తులో మన ఉద్యోగాలను మనమే సృష్టించుకుందామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
ప్రత్యేక హోదా పేరుతో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. హోదాలో పారిశ్రామిక రాయితీలు ఉండవని, హోదా వల్ల వచ్చే అన్ని ప్రయోజనాలు ప్యాకేజీలో ఉన్నాయని చెప్పారు. విద్యుత్, భూములు, నీటి వసతి కల్పించడం వల్ల ఏపీకి పరిశ్రమలు తరలి వస్తున్నాయన్నారు.
రామ్ గోపాల్ వర్మ ట్వీట్లపై.. నిన్న పవన్ కళ్యాణ్, నేడు చిరంజీవి కూతురు
గత రెండు రోజుల్లోనే రూ.1800 కోట్ల పెట్టుబడులతో పలు కంపెనీలు పనులు ప్రారంభించాయన్నారు. పెట్టుబడులు వస్తున్నప్పుడు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. వాతావరణ కాలుష్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, పరిశ్రమల్లో స్థానికులకే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.
హెచ్1బీ వీసాలు నిలిపేస్తే ఎలా?
హెచ్1బీ వీసాలు నిలిపివేస్తే ఎలాగని చంద్రబాబు ప్రశ్నించారు. అక్కడ ఉద్యోగాల కోసం ఫైట్ చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఉన్నపలంగా ఉద్యోగాలు తీసేయడం సరికాదన్నారు. దీనిపై ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తోందని చెప్పారు. అలాగే మన ప్రాంతంలో మన ఉద్యోగాలు క్రియేట్ చేసుకోవాల్సిన అవసరముందని చెప్పారు.
కాగా ఉపాధి, ఉన్నత విద్యాభ్యాసం కోసం మన దేశం నుంచి అమెరికా ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు మన వారి పాలిట ఆశనిపాతంలా తయారయ్యాయి. హెచ్1బీ, ఎల్1 వీసాలపై ఆంక్షలు అమలకు ట్రంప్ సన్నద్ధమవుతున్నారు.
దీంతో భారతీయుల్లో ఆందోళన ప్రారంభమైంది. ఉపాధి, ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏటా 30 వేల మంది వరకు పాస్పోర్టులు పొందుతున్నారు. ఇటీవలి కాలంలో సుమారు 2వేల మంది అమెరికా వెళ్లారు. గత పదేళ్లలో దాదాపు 30 వేల మంది ఉపాధి కోసం వెళ్లినట్లుగా అంచనా వేస్తున్నారు.